దేశంలో బెస్ట్‌గా తీర్చిదిద్దాలి.. ప్రభుత్వ ఆసుపత్రులపై సీఎం ఫోకస్
x

దేశంలో బెస్ట్‌గా తీర్చిదిద్దాలి.. ప్రభుత్వ ఆసుపత్రులపై సీఎం ఫోకస్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు.. ప్రైవేట్ వాటితో పోటీ పడాలన్నారు.


రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు.. ప్రైవేట్ వాటితో పోటీ పడాలని అన్న ఆయన ఈరోజు దేశంలోనే దిబెస్ట్ హాస్పిటల్స్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దవాఖానాలు తయారవ్వాలని అన్నారు. అలా వాటిని తీర్చిదిద్దేలా పని చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో ఈరోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రజలకు అందించే వైద్యం విషయంలో రాజీపడొద్దని, వారికి నాణ్యమైన, ఉత్తమైన వైద్యం అందించాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ భ్రష్టుపట్టించారని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి వస్తున్నామంటే.. తిరిగి వస్తామో రామో అన్న భయాందోళనలకు పేద ప్రజలు గురవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ గాడి తప్పి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ తిరిగి గాడిలో పెట్టాలని ఆదేశించారు.

ఉత్తమ విధానాలు కావాలి

‘‘వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి. టెలీ మెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పరిశుభ్రత చాలా ముఖ్యం. రోగులకు శుభ్రమైన బెడ్‌షీట్లు, బెడ్‌లు అందివ్వాలి. అదే విధంగా వారికి పరిశుభ్రమైన పరిసరాలు కల్పించాలి. అప్పుడే వారు త్వరగా, మంచిగా రికవర్ అవుతారు. రాష్ట్రంలో ఒక్కడా డోలీ మోయడాలు కనిపించకూడదు. ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలి. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని సూచించారు.

డోలీ మోయడాలు ఉండకూడదు

‘‘రాష్ట్రంలో ఇకపై ఎక్కడా కూడా డోలీ మోయడం అన్నది కనిపించకూడదరు. రాష్ట్ర నలుమూలలకు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి. ఫీడర్ అంబులెన్స్, సాధారణ అంబులెన్స్‌ల మధ్య కనెక్టివిటీని పెంచాలి. రోగులను డోలీతో మోసుకువస్తున్న ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. అలాంటివి ఇకపై కనిపించకూడదు. ఒకవేళ కనిపిస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీడర్ అంబులెన్స్‌లు వెళ్లే వెసులుబాటు ఉన్నా నిర్లక్ష్యం వహిస్తే స్వయంగా నేనే ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులపై చర్యలు తీసుకుంటా. 104 అంబులెన్స్‌లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది చాలా ముఖ్యం. ఏదో పేరుకు వెళ్లి తూతుమంత్రంగా టెస్ట్‌లు చేసి అంతా పరిష్కరించామని చెప్పడం సరికాదు. ప్రజలు తృప్తి చెందినప్పుడే మన వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్లమవుతాం’’ అంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.

మరుగున పడిన మహాప్రస్థానం

‘‘ఆసుపత్రుల్లో తనువు చాలించిన వారిని ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో మహాప్రస్థానం వాహనాలు తీసుకొచ్చాం. ఆఖరికి వాటిని కూడా మరుగున పెట్టేశారు. అవసరాన్ని బట్టి అంబులెన్స్‌ల వినియోగాన్ని పెంచాలి. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యాధిపై అవగాహన తీసుకురాగలిగితే మరణాలను తగ్గించవచ్చు. రాష్ట్రంలో జోన్ల వారీగా సర్వీస్ ప్రొవైడర్ మానిటర్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో చేసే శానిటేషన్‌ను అబ్జర్వేషన్ చేయాలి. మెడ్ టెక్ జోన్ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ మెడ్ టెక్ జోన్ ద్వారా జరుగుతోంది. తక్కువ ఖర్చుతో అన్ని రకాల మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందిస్తోంది. అయినా దీన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం...వారికి ప్రభుత్వమే స్థలం అందిస్తుంది. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తాం. దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్‌గా ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్ని వివరాలు పొందుపరచాలి

‘‘ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్ మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలి. కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలి. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలి. గతంలో ఉద్దానంలో పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే పూర్తిస్థాయిలో సమస్యను గుర్తించగలిగాం. ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్‌ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలి. ప్రి ల్యాబ్ టెస్ట్ ల అనంతరం పేషెంట్లకు సరైన విధానంలో మెడిసిన్ ఇవ్వగలిగితే 50 శాతం కంట్రోల్ చేయొచ్చు. రోగులకు డైట్ ప్లాన్, న్యూట్రిషన్ పై అవగాహన కల్పించగలిగితే వ్యాధుల నుండి కాపాడవచ్చు’’ అని చెప్పారు.

ఆ కేసులపై దృష్టిపెట్టాలి

‘‘ఆసుపత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి...మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను మళ్లీ తల్లులకు అందించాలి. బేబీలకు అవసరమైన సామాగ్రిని కిట్స్ ద్వారా అందించాలి. ప్రతి స్కూలులో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారో రిపోర్టు చేయాలి. టెలీ మెడిసిన్ కు గతంలో వరల్డ్ బ్యాంకు నుండి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చాం. కార్పొరేట్ లెవల్లో సేవలు అందించాలని నిర్ణయించాం. గ్రామాల్లో ఉండేవారికి టెలీ మెడిసిన్ ద్వారా మంచి డాక్టర్లతో అందించాలని నిర్ణయించాం. కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు. టెలీ మెడిసిన్‌పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నాం. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై పూర్తిస్థాయిలో సమాచారం కోసం పంచాయతీ రాజ్ శాఖతో కలిసి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలి’’ అని సీఎం అన్నారు.

Read More
Next Story