అన్ని మెడికల్ కాలేజీల్లో 10శాతం కోటా వారికే.. ప్రకటించిన ప్రభుత్వం
x

అన్ని మెడికల్ కాలేజీల్లో 10శాతం కోటా వారికే.. ప్రకటించిన ప్రభుత్వం

విద్యా సంవత్సరం 2024-2025కు సంబంధించి మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.


విద్యా సంవత్సరం 2024-2025కు సంబంధించి మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా అందించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి కళాశాల కూడా తమ మెడికల్ సీట్లలో 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు కొన్ని కళాశాలల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ పద్దతిని అన్ని కళాశాలలకు వ్యాపింప చేస్తున్నట్లు కూటమి సర్కార్ వివరించింది. త్వరలోనే మెడికల్ కాలేజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం కీలకంగా మారింది. ఈ విషయంలో పక్కా ప్రాణాళికతో తాము అడుగులు వేస్తున్నామని, ఆర్థికంగా వెనకబడిన వారికి వారి ఆర్థిక స్థితి చదువులో కూడా అడ్డురాకూడదన్న ఉద్దేశంతోనే ఈ కోటా అమలును యుద్ధప్రాతిపదికన అమలు చేయనున్నట్లు కూటమి సర్కార్ తెలిపింది.

వాటికి వర్తించదు

ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీతో అనుసంధానమైన అన్ని మెడికల్ కాలేజీల్లో ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వుల నుంచి మైనార్టీ విద్యాసంస్థలకు మినహాయింపు ఉందని, వాటిలో ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ల భర్తీ ప్రక్రియ జరగదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వివరించారు. అంతేకాకుండా ఈ కోటా సీట్లు అన్నీ కోర్సుల్లో కాకుండా.. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తుందని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కోటా వర్తించదని వెల్లడించారు. నీట్ యూజీ 2024 ఫలితాలు వచ్చిన క్రమంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది.

అసలేంటీ EWS

ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానిమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారు అని. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితి పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, జనరల్ కేటగిరీలో కూడా ఆర్థికంగాబలహీనంగా ఉన్న వారు ఎందరో ఉన్నారని, వారికి కూడా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ చట్టంలో కీలక సవరణ తీసుకొచ్చింది. అదే ఈ ఈడబ్ల్యూఎస్. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై విచారణ జరగగా అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చింది.

విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 10శాతం రిజవర్వేషన్లు కల్పించేలా 2019లో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15, 16ల్లో ప్రత్యేక నిబంధనలను కూడా చేర్చింది. ఫలితంగా రిజర్వేషన్లు అందని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. దీనికే సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలుపుతూ 2021 మే నెలలో తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటూ ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
Next Story