EWS అమలుపై హైకోర్టు స్టే..
x

EWS అమలుపై హైకోర్టు స్టే..

రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల భర్తీ చేయాలన్న భావించిన ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది.


రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్ల భర్తీ చేయాలన్న భావించిన ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఈడబ్ల్యూఎస్ అమలు జీవోపై స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను ారు వారాలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు లేనట్లేనని నిపుణులు చెప్తున్నారు. విద్యార్థుల పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. ఈడబ్ల్యూ అమలు జీవోపై ఈరోజు తొలి విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత జీవోపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించి కేసును వాయిదా వేసింది.

పిటిషన్ ఎందుకంటే..

అయితే అన్ని వైద్య విద్య కళాశాలల్లోని సీట్ల భర్తీలో 10 శాతం సీట్లను ఈ డబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తోసిపుచ్చారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని, జీవోను ఎలా ఇస్తారని విద్యార్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. వారి పిటిషన్‌పై జరిగిన విచారణలో.. సీట్ల సంఖ్య పెంచిన తర్వాతే ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేయాలని, లేని పక్షంలో ఓపెన్ కేటగిరీ వాళ్లు తీవ్రంగా నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్. వారి వాదనలు విన్న అనంతరం జీవోపై స్టే విధించింది న్యాయస్థానం.

ప్రభుత్వం చేసిన ప్రకటన ఏంటంటే..

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కింద 10శాతం సీట్ల భర్తీ చేయాలని అని యూనిర్శిటీలను ఆదేశించింది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనిర్శిటీతో అనుసంధానమైన అన్ని మెడికల్ కాలేజీల్లో ఈ ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వుల నుంచి మైనార్టీ విద్యాసంస్థలకు మినహాయింపు ఉందని, వాటిలో ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ల భర్తీ ప్రక్రియ జరగదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వివరించారు. అంతేకాకుండా ఈ కోటా సీట్లు అన్నీ కోర్సుల్లో కాకుండా.. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తుందని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కోటా వర్తించదని వెల్లడించారు. నీట్ యూజీ 2024 ఫలితాలు వచ్చిన క్రమంలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ఈ విషయంలో పక్కా ప్రాణాళికతో తాము అడుగులు వేస్తున్నామని, ఆర్థికంగా వెనకబడిన వారికి వారి ఆర్థిక స్థితి చదువులో కూడా అడ్డురాకూడదన్న ఉద్దేశంతోనే ఈ కోటా అమలును యుద్ధప్రాతిపదికన అమలు చేయనున్నట్లు కూటమి సర్కార్ తెలిపింది.

EWS అంటే ఏంటి.. ఎప్పుడు అమలైంది..

ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానిమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారు అని. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితి పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, జనరల్ కేటగిరీలో కూడా ఆర్థికంగాబలహీనంగా ఉన్న వారు ఎందరో ఉన్నారని, వారికి కూడా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ చట్టంలో కీలక సవరణ తీసుకొచ్చింది. అదే ఈ ఈడబ్ల్యూఎస్. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై విచారణ జరగగా అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చింది.

విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 10శాతం రిజవర్వేషన్లు కల్పించేలా 2019లో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15, 16ల్లో ప్రత్యేక నిబంధనలను కూడా చేర్చింది. ఫలితంగా రిజర్వేషన్లు అందని ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. దీనికే సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలుపుతూ 2021 మే నెలలో తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటూ ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
Next Story