మంగళగిరి నియోకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు నువ్వానేనా అంటున్నాయి. అటు టీడీపీ నేత లోకేష్‌ను ఎలా ఢీకొనాలనే ఎత్తుగడలో వైఎస్సార్‌సీపీ ఉంది.


జి విజయ కుమార్

మంగళగిరి నియోజక వర్గం రాజకీయ చర్చకు వేదికగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటికే ఇద్దరు సమన్వయ కర్తలను మార్చింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. ఎవరు ఏమి సూచనలు చేశారో.. సలహాలు ఇచ్చారో కానీ వైఎస్‌ఆర్‌సీపీ గంజి చిరంజీవిని పక్కన పెట్టి మురుగుడు లావణ్యను తెరపైకి తీసుకొచ్చింది. తనకు సీటు దక్క లేదని పార్టీ నుంచి బటయకు వెళ్లి తిరిగి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరు పోటీలో ఉన్నా గెలుపునకు కృషి చేస్తానని సెలవిచ్చారు.
ఎందుకు ఈ అభ్యర్థుల మార్పు
సిట్టింగ్‌ను కాదని మరొకరికి సమన్వయ కర్తగా ఇచ్చి ఆయనను కూడా పక్కన పెట్టి మరొకరికి సమన్వయ కర్తగా అవకాశం కల్పించింది వైఎస్‌ఆర్‌సీపీ. ఎందుకు ఇలా అభ్యర్థులను మార్చే కార్యక్రమం చేపట్టారో పార్టీ వర్గాల కూడా అర్థం కావడం లేదు. ఇన్ని సార్లు అభ్యర్థులను మారుస్తున్నారంటే అక్కడ గెలుపు అంత తేలిక కాదని అర్థమైందేమో అంటున్నారు..మరి కొందరు.
50 వేల ఓట్ల మెజారీటితో గెలిచి చూపిస్తా
మంగళగిరిని చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తా. 50వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తా. నా గెలుపును ఎవ్వరు ఆపలేరు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జయహో బిసి సభలో తండ్రి బాబు ఎదుట విజయ గర్వంతో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత మంగళగిరి నియోజక వర్గంలో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఎవరి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించే పనిలో లోకేష్‌ ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ దాదాపు ఏదో ఒక రూపేణ సాయం అందించారు. యువతకు క్రీడా ప్రాంగణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్ళికి తాళి బొట్లు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం గత ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది.
ఇవన్నీ చూసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎలాగైనా లోకేష్‌ పరపతిని దెబ్బ కొట్టి మంగళగిరిలో తిరిగి పాగా వేయాలని అత్యధిక ఓట్లున్న సామాజిక వర్గమైన పద్మశాలీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని రంగంలోకి దించారు.







Next Story