అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ సూర్యదేవరలతో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ క్యాలండర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు లేకుండానే అసెంబ్లీ క్యాలండర్ను ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరం క్యాలండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. క్యాలండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తుచేశారు. సైమన్ గో బ్యాక్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్య్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయసహకారాలు అందించారని చెప్పారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని అన్నారు. ఢిల్లీలో పరిపాలన– శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని అన్నారు.