వార్ సరే, కుంగిన పిల్లర్లకు బాధ్యులెవరు?
x
మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద బీఆర్ఎస్ ప్రతినిధివర్గం

'వార్' సరే, కుంగిన పిల్లర్లకు బాధ్యులెవరు?

తెలంగాణలో ఉన్నట్టుండి నీళ్ల మంటలు చెలరేగాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఇప్పుడీ వాటర్ వార్ ఓ రేంజ్ లో ఉంది. కేటీఆర్ బృందం మేడిగడ్డకు ఎందుకెళ్లినట్టు?


తెలంగాణలో ఉన్నట్టుండి నీళ్ల మంటలు చెలరేగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాటర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మంటలు పుట్టిస్తోంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు కూడా ఉండడంతో ఇప్పుడీ వాటర్ వార్ ఓ రేంజ్ లో ఉంది. పిల్లర్ల కుంగుబాటుకు బీఆర్ఎస్ ను బాధ్యురాలిగా చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే అసలు మొత్తం నీటి సమస్యకు కాంగ్రెస్సే కారణమంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. పోటాపోటీ ప్రదర్శనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి ఒకటిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌.. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో నీటి పోరు యాత్రలో భాగంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్‌ చేసింది.

ఎన్నికల వరకేనా ఈ హడావిడి..

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గులాబీ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. కృష్ణా జలాల వినియోగంపై కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇటీవల నల్లగొండలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన కాంగ్రెస్‌.. కృష్ణా జలాలపై హక్కులను కోల్పోయేలా చేసిందని ఆరోపించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ నీటి పోరు యాత్రలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌.

అసలేమిటీ వివాదం...

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు 8 వరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిపోయాయి. అప్పటినుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ... బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టు అని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బ్యారేజీలోని లోపాలను ఎత్తిచూపారు.

బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్...

బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నల్లగొండ సభా వేదికగా తాము కూడా మేడిగడ్డకు వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, ప్రాజెక్టులో ఇది ఒక బ్యారేజీ మాత్రమేనని చెబుతోంది బీఆర్‌ఎస్‌. ఈ క్రమంలోనే ఇవాళ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌. 150 నుంచి 200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో మేడిగడ్డను సందర్శించింది. బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి వర్గం కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడింది.

విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్...

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు చేస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి విచారణ అయినా జరుపుకోవచ్చని ప్రకటించింది బీఆర్‌ఎస్‌. అంతటితో ఆగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. మేడిగడ్డలో కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందంటున్న గులాబీ పార్టీ.. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలని హితవు పలికింది.

మరోవైపు, గోదావరి జలాల వినియోగంపై చేపట్టనున్న నీటి పోరు యాత్రలో భాగంగా.. మార్చి 10న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభ ద్వారా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.

మేడిగడ్డ తర్వాత ఏమిటి?

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్‌ఎస్‌ నేతలు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ అధికార పార్టీ దుష్ప్రచారం చేయడం సరికాదు. పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపీ తీర్చుకోండి. రైతులు, రాష్ట్రంపై వద్దు” అని కేటీఆర్ చెప్పడం బాగానే ఉంది గాని కుంగిన పిల్లర్లకు ఎవరు బాధ్యత వహించాలో చెప్పకపోవడం విడ్డూరం. తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటనను చిన్నదిగా చేసి చూపడం కూడా సరికాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Read More
Next Story