మావోయిస్టుల్ని మట్టుబెట్టడానికి ఏటా రూ.1000 కోట్లా?
x
Source: Twitter

మావోయిస్టుల్ని మట్టుబెట్టడానికి ఏటా రూ.1000 కోట్లా?

మావోయిస్టుల కట్టడికి, ఏరివేతకు, ఎన్‌కౌంటర్లకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా.. తెలిస్తే షాకవుతారు..


నక్సలైట్లుగా ముద్రపడిన మావోయిస్టుల కట్టడి, ఏరివేతకు, ఎన్ కౌంటర్లకు ఏటా వేయి కోట్ల రూపాయల ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయడమంటే వాళ్లను సంస్కరించి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం. అలాంటి పని కోసం ఖర్చు పెడుతున్నారో లేక వామపక్ష తీవ్రవాదుల్ని లేపేయడానికి ఖర్చు చేస్తున్నారా అని పలువురు హక్కుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నా .. దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది. అయినా దేశంలో ఎక్కడో ఒక చోట ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఒకరో ఇద్దరో ముగ్గురో అటు జవాన్లో ఇటు మావోయిస్టులో చనిపోతూనే ఉన్నారు. ఎప్పుడో మూడేళ్ల కిందటే దేశంలో 400లకు మించి మావోయిస్టులు లేరని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేస్తోందో అర్థం కావడం లేదన్నారు ఏపీసీఎల్సీ నేత సీహెచ్ చంద్రశేఖర్. కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.1000 కోట్లకు పైగా వెచ్చించింది. అంటే ఈ ఐదేళ్లలో ఐదు వేల కోట్లరూపాయలు ఖర్చు చేసినట్టు. ఈ మొత్తాన్ని ఏదైనా ప్రాజెక్టుపై ఖర్చు పెడితే లక్షలాది మందికి ఉపాధి వస్తుంది.

దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర బలగాలను పంపుతోంది. మారుమూల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తద్వారా ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ఒకప్పుడు ఆరేడు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రంగా ఉంది. పూటకో ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. గత నాలుగు నెలల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో 80 మంది మావోయిస్టులు మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బలగాలను పంపడంతోనే సరిపెట్టకుండా కేంద్రం వివిధ పథకాల కింద మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్‌లలో కొంతమేర ప్రభావం కనిపిస్తోంది.

మావోయిస్టులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను పంపుతోంది. గతంతో పోల్చుకుంటే ఈ బలగాలు ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతలో రాటుదేలాయి. 2018-19 నుంచి 2022-23 వరకు.. అంటే ఐదేళ్ల కాలంలో కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు రూ.4,931 కోట్లు మంజూరు చేసింది. దీనికితోడు బలగాలను క్షేత్రస్థాయికి తరలించేందుకు, గాయపడిన వారిని చికిత్స కోసం తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ల ఖర్చుల కింద మరో రూ.765 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ ఇటీవల రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలను పేర్కొంది.

ఈ ఐదేళ్లలో ప్రభావిత ప్రాంతాల్లో 13,630 కిలోమీటర్ల మేర రహదారులు, 13,823 సెల్‌ఫోన్‌ టవర్లు కొత్తగా నిర్మించారు. సరైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని, తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లకుండా చూడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. 2010లో 96 జిల్లాల్లోని 465 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న మావోయిస్టు కార్యకలాపాలు 2023 నాటికి 42 జిల్లాలు, 171 పోలీస్‌స్టేషన్లకు పరిమితం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్పెషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్కీం’, ‘సెక్యూరిటీ రిలేటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌’, ‘స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌’ వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులను పోలీస్‌స్టేషన్ల నిర్మాణం; పోలీసు వాహనాలు, అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు మొదలుకొని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కూడా వెచ్చించవచ్చు. ఓవైపు భద్రతా బలగాలతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు అభివృద్ధితో ప్రజలకు దగ్గర అవడం ద్వారా వామపక్ష తీవ్రవాదంపై పట్టు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది.

Read More
Next Story