‘జగన్‌కు బాధ్యత లేదా’.. మండిపడ్డ చంద్రబాబు..
x

‘జగన్‌కు బాధ్యత లేదా’.. మండిపడ్డ చంద్రబాబు..

తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాద వివాదం నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.


తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాద వివాదం నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో అపచారాలు జరిగాయని, భక్తులను మనోభావాలను దెబ్బతీసే ఘటనలూ జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై వైసీపీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు అన్నారు. జగన్.. దేవుడిని దర్శించుకోవచ్చని, కానీ ఆయనకు వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా? లేదా? అనేది ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని, అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా? అని కూడా ప్రశ్నించారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో రథం దహనమైన ఘటనపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

వెంటనే అరెస్ట్ చేయండి: చంద్రబాబు

అనంతపురం జిల్లాలో రథం దగ్దమైంది. ఈఘటనపై స్పందించిన చంద్రబాబు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని అధికారులను అడిగారు. ఆగంతకులు ఉద్దేశపూర్వంగా నిప్పు పెట్టడంతోనే రథం దగ్దమైందని అధికారులు వివరించారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇటువంటి చర్యలను కూడా తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

బాధ్యత ఉండనక్కర్లా: చంద్రబాబు

‘‘ఆయన (వైఎస్ జగన్) దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు’’ అని మండిపడ్డారు చంద్రబాబు.

అది స్వామి ద్రోహమే..

‘‘ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు… హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?... రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రధం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరగడం మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్టు కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం’’ అని అన్నారు.

Read More
Next Story