చంద్రబాబు ఎన్నికల కేక!  కనిగిరిలో మోగిన శంఖారావం
x
కనిగిరి సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు ఎన్నికల కేక! కనిగిరిలో మోగిన శంఖారావం

నోటిఫికేషన్ కి ముందే ఏపీలో ఎన్నికల శంఖారావం మోగింది. అలనాడు ఎన్టీఆర్ ఇచ్చిన రా.. కదిలిరా పేరిట ఈసారి చంద్రబాబు పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల హోరు షురూ చేశారు.


సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబు శంఖం మోగించారు. తొలిసభలో అధికార వైసీపీపై నిపులు చెరిగారు. ఎన్టీరామారావు ఇచ్చిన పిలుపు రా.. కదిలిరా అంటూ కదం తొక్కారు. జనసేన, టీడీపీ కూటమిని ఆదిరించాలని కోరారు. చంద్రబాబు ప్రసంగం పేలవంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని చెదరగొట్టేలా ప్రసంగంలో మెరుపులు మెరిపించారు. ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు నోటి వెంట ఇప్పటి వరకు వినబడని పదాలు కూడా ఈసారి వినపడడం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబు విశ్వరూపాన్ని తొలిసభలోనే చూపించారు.

చంద్రబాబు ఈసారి ఎన్నికల ప్రచార సభకు ప్రకాశం జిల్లా కనిగిరిని వేదిక చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి కనిగిరి సభకు హాజరయ్యారు. టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. నోటిఫికేషన్ కి ముందే రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచార సభగా ఈ మీటింగ్ ను అభివర్ణించవచ్చు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశం - జనసేన తోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లేలా సభ నిర్వహణ సాగింది. “రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్‍గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ దుష్ట పాలనకు చరమగీతం పాడదాం” అనే నినాదంతో ఈ తొలి సభ ఏర్పాటైంది.

ఇక హెలికాఫ్టర్ లోనే ప్రయాణం...


ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‍లో చంద్రబాబు కనిగిరి వచ్చారు. "రా కదలి రా!" పేరిట నేటి నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒంగోలు పార్లమెంట్ పరిధి కనిగిరిలో తొలి బహిరంగ సభ ఇది. జనవరి 5 నుంచి 29 వరకూ 22 పార్లమెంట్ స్థానాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఒక్కో సభకు లక్ష మంది తగ్గకుండా జనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పలు సభల్లో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశం - జనసేన తోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లేలా సభల నిర్వహణ రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్‍గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడదాం నినాదంతో సభల నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులు రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున రవాణా సౌకర్యార్ధం చంద్రబాబు హెలికాఫ్టర్‌‍ను వినియోగిస్తున్నారు.

ఇది రాక్షస ప్రభుత్వమంటూ వ్యాఖ్య..

“రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం. జనసేనతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలి”అన్నారు చంద్రబాబు. ‘‘ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా! అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైంది. ఈరోజు మీ అందరి సహకారం అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా! అని పిలుపునిస్తున్నా. నేను.. పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత” అన్నారు చంద్రబాబు నాయుడు.

‘రా కదలి రా’ కార్యక్రమాన్ని పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి ప్రారంభించాం. కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన అందరికీ అభినందనలు. కనిగిరి సభ ద్వారా పిలుపునిస్తున్నా.. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్‌ పాలన రావాలి’. అభివృద్ధి - సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్‌. గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. మీకు ఇచ్చేది పది రూపాయలు అయితే.. దోచుకునేది వంద రూపాయలు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి, వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడం. కానీ, రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదు’’ అని విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యేలు.. ఎంపీలకు బదిలీలు ఉంటాయా?

‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే. ఒక్క ఛాన్స్‌ అన్నారని జగన్ మాయలో పడ్డారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్‌ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారు. పాలన సమర్థంగా ఉంటే కరెంట్‌ ఛార్జీలు పెంచే అవసరం లేదు. ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగింది. తెదేపా పాలనలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాలి. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండపిలో బంగారం అవుతుందా? మన రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్ కావాలని ప్రణాళికలు రచించాం. నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా’’ అన్నారు చంద్రబాబు.

Read More
Next Story