కేంద్ర బడ్జెట్‌.. నితీశ్‌ కుమార్‌ హీరో – చంద్ర బాబు జీరో అన్నట్లుందని తులసి రెడ్డి ఎద్దేవా చేసారు.


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కడప జిల్లాకు, రాయలసీమకు, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వేంపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని, నల్ల జెండాలతో నిరసన దీక్ష చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ నిల్‌–బీహార్‌కు ఫుల్‌ పేరుతో చేపట్టిన నిరసన దీక్షలో రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగినట్లే ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్‌ లో కడప జిల్లాకు, రాయల సీమకు, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వ మనుగడ టీడీపీ మీద ఆధారపడి వుంది. కనుక ఈ సారి రాష్ట్రానికి తప్పక న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విభజన చట్టంలో 13వ షెడ్యూల్‌ ప్రకారం కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరగాలి. దీనికి కావలసిన భూమి, నీరు, విద్యుత్‌ శక్తి, రవాణా సౌకర్యాలు, ముడి పదార్థాలు అన్నీ జిల్లాలో వున్నాయి. కానీ నిర్మాణానికి నోచుకోలేదు. ఈ సారి బడ్జెట్‌లో కూడా ఆ ప్రస్తావన లేదు.

కడప – రాయచోటి – బెంగుళూరు నూతన బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గం రాయల సీమ సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. అందువల్ల 2008– 2009 రైల్వే బడ్జెట్‌లో ఈ లైన్‌ మంజూరైంది. కడప నుంచి పెండ్లిమర్రి వరకు లైన్‌ పూర్తి అయింది. మోదీ ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సారి బడ్జెట్‌లోనైనా ఈ లైన్‌కు నిధులు మంజూరు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు భావించారు. కానీ కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేదని తులసిరెడ్డి మండిపడ్డారు.
విభజన చట్టంలో సెక్షన్‌ 46 ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి. కానీ దానిని ప్రకటించ లేదు. ఈ బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు. ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్‌ లో దీని ప్రస్తావనే లేదు. కేంద్ర బడ్జెట్‌ బీడీ బడ్జెట్‌గా వుందనీ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. బీ అంటే బీహార్, డీ అంటే ఢిల్లీ. ఆంధ్రాకు నిల్‌ – బీహార్‌కు ఫుల్‌ అన్నట్లుంది ఈ బడ్జెట్‌ అని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నితీశ్‌ కుమార్‌ హీరో – చంద్రబాబు జీరో అన్నట్లుందని తులసిరెడ్డి ఎద్దేవా చేసారు. ఇందుకు నిరసనగా ఆదివారం వేంపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నిరసన దీక్ష చేపట్టినట్లు తులసి రెడ్డి చెప్పారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్‌ నాయకులు రామాంజనేయ రెడ్డి, ఉత్తన్న, బద్రి నాథ్, వెంకటేష్, మహబూబ్‌ బాషా, రవి, వినయ్, అయిచర్‌ రమణ, సాయి, శ్యాం, దిలీప్, కిరణ్, విజయ్, పాపయ్య, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.
Next Story