మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణకుమార్‌రెడ్డి అవినీతిపైన, ఎన్నికల రంగంలో పెరిగిన ఖర్చులపైన సంచలన కామెంట్స్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోను, భారత దేశంలోను అవినీతి విచ్చల విడిగా పెరిగి పోయిందన్నారు. మరో వైపు ఎన్నికలంటేనే భయమేస్తోందని.. ఎన్నికల్లో పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిందని వ్యాఖ్యానించిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల్లో భారీగా పెరిగిన ఖర్చులను చూస్తోంటే భవిష్యత్‌ ఎన్నికల్లో పోటీ చేయలేమని వ్యాఖ్యానించారు. డబ్బును లూఠీ చేసే కొందరు నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అలాంటి లూటీ చేసే నాయకులకు ప్రజలు తమ ఓట్లు వేసి మద్ధతు తెలుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ప్రముఖ న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. మాజీ మంత్రి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్, మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన సమస్యలపైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా ఏర్పడి పదేళ్లైనా విభజన సమస్యలు పరిష్కరించుకోలేదని, నేటికీ ఆ సమస్యలు అలానే ఉన్నాయని, సామరస్యంగా నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. అవినీతికి పాల్పడటంతో అవినీతిలో వచ్చిన డబ్బును అటు అధికారులు, నాయకులు కలిసి పంచుకుంటున్నారని అన్నారు. ఇదే సందర్భంలో తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో ఉన్న వ్యక్తిగా తనలో ఎలాంటి మార్పు రాలేదని, పేదవారికి సహాయం చేసే లక్ష్యంతోనే తాను ఉన్నట్లు చెప్పొకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ దేశ అభివృద్ది కోసం కృషి చేస్తోందని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత కే రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తర్వాత నాటి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. 2010 నుంచి 2014 రాష్ట్రం విడిపోయే నాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాల 96 రోజులు సీఎంగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలచుకోలేక పోయింది. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మిథున్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.
Next Story