అమరావతిలో కొందరు రైతులు భూ సమీకరణకు నేటికీ అంగీకరించలేదు. కోర్టుల్లో కేసులు వేశారు. ఈ కారణంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఆగిపోయింది.


ఏపీ రాజధాని అమరావతిలో భూ సమీకరణ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. 4,181 ఎకరాల భూమి అక్కడక్కడ సమీకరించాల్సి ఉంది. ఈ భూముల రైతులు తమ భూమిని సమీకరణకు ఇచ్చేది లేదని, కే ంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం భూ సేకరణ నోటీసులు ఇచ్చి తీసుకోవాలని కోరుతున్నారు. ఎలాగైనా సమీకరణకు ఒప్పించి తీసుకోవాలనే ఆలోచలో ప్రభుత్వం ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 191.62 ఎకరాలను మాత్రమే సమీకరించ గలిగింది. రైతుల అంగీకరంతో భూ సమీకరణ ద్వారా ఈ భూమిని తీసుకున్నారు.

సమీకరణకు, సేకకరణకు తేడా ఏమిటి?
రాజధానిలో భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ద్వారానే ఇప్పటి వరకు ప్రభుత్వం భూములు తీసుకుంది. అయితే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు గ్రామాలకు చెందిన భూ సమీకరణకు తమ భూములు ఇవ్వలేమని, తమకు కొద్ది భూమి మాత్రమే ఉందని, ఈ భూమిని కూడా ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చేస్తే చాలా నష్టపోతామని చెబుతున్నారు. అందుకే తమ భూమిని భూ సేకరణ ద్వారా తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలా కాకుండా వారిని భూ సమీకరణకు ఒప్పించేందుకు అధికారులు సమావేవాలు పెట్టి ప్రయత్నింస్తుండటంతో వివాదమై కోర్టుల్లో కేసులు వేశారు. నేటికీ ఒక కొలిక్కి రాలేదు. ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతుల భూములు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఉండటంతో రోడ్డు నిర్మాణం ఆగిపోయింది.
గత ప్రభుత్వం వెనక్కు తీసుకున్న భూ సేకరణ నోటీస్‌
రాజధాని ప్రాంతంలో ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిన చోట రైతులకు ప్లాట్లు కేటాయించాల్సిన ప్రాంతంలో 4,300 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో 2,680 ఎకరాలకు సంబంధించి ప్రక్రియ మొదులు పెట్టారు. ఇందులో 191.62 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం సేకరించ గలిగింది. మిగిలిన 4,181 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఉండవల్లి, పెనుమాక, నవులూరు, నిడమర్రు గ్రామాలకు చెందిన 1,197.30 ఎకరాలకు సంబంధించి భూ సేకరణ కోసం 2023లో భూ సేకరణ కోసం అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకుంది. ఈ గ్రామాల్లో 2,010 ఎకరాలు సేకరించాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ సూచనల మేరకు గుంటూరు కలెక్టర్‌ భూ సేకరణ నోటీసు ఇచ్చిన పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. నెగోసియేషన్స్‌ జరిగాయి. 369.23 ఎకరాల రైతులు పూలింగ్‌కు భూమి ఇచ్చేందుకు అంగీకరించడంతో వారిని భూసేరణ నోటీసు నుంచి మినహా యించారు. వీరికి డబ్బులు కూడా చెల్లించారు. రోడ్ల కింద 334.95 ఎకరాలు పోయాయి. వేరు వేరు సంస్థలకు 8.40 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 1,197.30 ఎకరాల భూ సేకరణ నోటీస్‌ను ప్రభుత్వం అప్పట్లోనే వెనక్కు తీసుకుంది. దీంతో సేకరణ జరగాలంటే తిరిగి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్నందున రైతులతో పూర్తిగా మాట్లాడి వారి నుంచి సమస్యలు పరిష్కరించుకుని, కోర్టు కేసులు వెనక్కు తీసుకుంటేనే రోడ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం అధికారులు తమ ప్రయత్నాలు ప్రారంబించారు. అవసరమనుకుంటే రైతులతో నేరుగా మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది.అమరావతిలో ఇంకా సేకరించాల్సిన భూమి ఎంతో తెలుసా?
Next Story