మనుషులు, పశువులు, ఇతర జంతువుల లెక్కలు సేకరిస్తారు. అదే రకంగా పులులు ఎన్ని ఉన్నాయో అనే లెక్కలు కూడా సేకరిస్తారు. అయితే ఆ రెంటింటికీ తేడాలు ఉన్నాయి. టైగర్‌ సెన్సెన్‌ను ఏమంటారు? ఎలా సేకరిస్తారు?


మనుషుల జనాభాల లెక్కలకు, పులులను లెక్కించడంలో తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరిని లెక్కిస్తారు కాబట్టి హ్యూమన్‌ సెన్సెస్‌ అంటారు. కానీ పులులు విషయంలో అది సాధ్యం కాదు. ప్రతి ఒక్క పులిని లెక్కించడం అసాధ్యం. అటవీ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయనే దానిపై కేవలం వాటి సంఖ్యను మాత్రమే అంచనా వేయగలుగుతాం. అందువల్ల టైగర్‌ సెన్సెస్‌ అనలేమని, టైగర్‌ ఎస్టిమేషన్‌ అని అంటారని నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వు(ఎన్‌ఎస్‌టీఆర్‌) ప్రాజెక్టు టైగర్‌ మార్కాపూర్‌ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ అప్పవు ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు తెలిపారు.

ఫారెస్ట్‌లో ప్రతి టైగర్‌ను కౌంట్‌ చేయడం కుదరు. అందువల్ల కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి ఎస్టిమేషన్‌ చేస్తారు. కెమేరాల ద్వారా ట్రాప్‌ చేయడం, తద్వారా చారల ఆధారంగా అంచనా వేయడం జరుగుతుందని ఎన్‌ఎస్‌టీఆర్‌ ప్రాజెక్టు టైగర్‌ ఆత్మకూర్‌ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబ వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అడవుల్లో ఒకే ఒక టైగర్‌ జోన్‌ ఉంది. ఇది నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్‌ జోన్‌గా పేర్కొంటారు. ఇంత పెద్ద జోన్‌ ఏ రాష్ట్రంలోను లేదు. దీనిని నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ జోన్‌ అంటారు. ఇది దాదాపు 5,400 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీనిలో ఆత్మకూరు, మార్కాపూర్, నంద్యాల, గిద్దలూరు నాలుగు డివిజన్లు ఉన్నాయి. దీని మొత్తాన్ని పర్యవేక్షించడానికి సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు ఒక ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఉంటారు. ఈ అధికారిని కన్సర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్టు(సీఎఫ్‌) అంటారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో డిప్యూటీ డైరెక్టర్‌ చొప్పున నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు. వీరు కూడా ఐఎఫ్‌ఎస్‌ ర్యాంకు అధికారులే ఉంటారు.
జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఈ జోన్‌ పరిధిలో టైగర్‌ ఎస్టిమేషన్‌ చేపడుతారు. నాలుగు డివిజన్లలోని ప్రతి ప్రాంతాన్ని టూ బై టూ గ్రిడ్‌లుగా ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి గ్రిడ్‌లో రెండు కేమెరాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. వీటిని చెట్లకు కానీ లేక పోతే ట్రక్కులకు కానీ అమర్చుతారు. వీటిల్లో ఒక కెమేరా ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. దీనికి మోషన్‌ సెన్సర్‌ ఉంటుంది. దీని ద్వారా ఆక్కడ తిరిగే జంతువులను మాత్రమే క్యాప్చర్‌ చేస్తారు. దాదాపు 40 రోజుల పాటు ఈ కెమేరాలను ఆయా ప్రాంతాల్లో ఉంచుతారు. ఈ నలభై రోజుల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగే జంతువులను ఈ కెమేరాల ద్వారా క్యాప్చర్‌ చేస్తారు. నలభై రోజులు పూర్తి అయిన తర్వాత ఆ కెమేరాలను తీసేస్తారు. వాటిల్లో రికారై్డన డేటాను తీసుకుంటారు. వీటిల్లో అన్ని జంతువులు క్యాప్చర్‌ అయి ఉంటాయి. అయితే తక్కిన జంతువులను పక్కన పెట్టి కేవలం టైగర్‌లకు సంబంధించిన డేటాను మాత్రమే తీసుకుంటారు. ఇంత వరకు అన్నీ ఫారెస్టు అధికారుల నేతృత్వంలో మాన్యువల్‌గానే చేపడుతారు. ఇలా కెమేరాల్లో క్యాప్చర్‌ అయిన అన్ని జంతువుల నుంచి టైగర్‌లను వేరు చేసిన తర్వాత టైగర్‌ ఎస్టిమేషన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌కు కనెక్ట్‌ చేస్తారు. దీని సహాయంతో ఎన్ని పులులు ఉన్నాయనే దానిపై ఒక అంచనాకు వస్తారు. ఈ వివరాల ఆధారంగా నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ జోన్‌ పరిధిలో ఎన్ని పులులు ఉన్నాయనే వివరాలను ప్రభుత్వానికి నివేదికను అందజేస్తారు. ఈ వివరాల ఆధారంగా తయారు చేసిన ఒక ఆల్బమ్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా రిలీజ్‌ చేశారు. దీంతో పాటుగా ఫారెస్టు అధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు 87 పులులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వీటితో పాటుగా మరో 8 పులి పిల్లలకు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందినవే. దేశంలోని తక్కిన అటవీ ప్రాంతంలో కూడా ఇదే జాతి పులులే ఉన్నాయి.
ప్రతి మనిషి వారి చేతి వేళ్ళకు ప్రత్యేకంగా ముద్రలు ఉన్నట్లుగానే, ప్రతి టైగర్‌ కూడా ఒక యునిక్‌ ఐడెంటిటీని కలిగి ఉంటుంది. పులలకు వాటి శరీరం మీద ఉన్న చారలు ఈ ప్రత్యేకతను తెలియజేస్తాయి. వీటి ఆధారంగా ఎన్ని ఉన్నాయేనే ఎస్టిమేషన్‌ చేస్తామని విగ్నేష్‌ అప్పవు తెలిపారు.
దేశ వ్యాప్తంగా కూడా టైగర్‌ ఎస్టిమేషన్‌ చేపడుతారు. దీనిని ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ అంటారు. ఇది ప్రతి నాలుగేళ్లకు ఒక సారి జరుగుతుంది. నేషనల్‌ టైగర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో ఈ ఎస్టిమేషన్‌ చేపడుతారు. రెండేళ్ల క్రితం అంటే 2022లో ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత అంటే 2026లో ఎస్టిమేషన్‌ చేపట్టనున్నారు. అయితే ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపి ఫారెస్టు అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా చేపడుతున్నారు. ప్రతి ఏటా టైగర్‌ ఎస్టిమేషన్‌ అనే ప్రక్రియ గత 16 ఏళ్లుగా చేస్తున్నట్లు విగ్నేష్‌ అప్పవు తెలిపారు.
ఇతర జంతువులతో పోల్చితే పులులు ప్రమాకరమైనవి. వీటిని గుర్తించేందుకు కెమేరాలను అమర్చే సమయంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల అవి తిరగని సమయాల్లో అమర్చేందుకు చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మంది సిబ్బంది గుంపులుగా ఉండేవిధంగా చూసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్లి కెమేరాలను అమర్చుతామని విగ్నేష్‌ అప్పవు చెప్పారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో ఉండే జంతువులపై సిబ్బందికి, అధికారులకు అవగాహన ఉంటుంది. ఏ జంతువు ఎప్పుడు ఎలా తిరుగుతాయి, ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు లోపలకు వెళ్తాయి, ఎప్పుడు సిబ్బంది వెళ్ల కూడదు, ఎప్పుడు వెళ్లాలి అనే అంశాలపూ పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారు. దీంతో సాధ్యమైనంత వరకు వాటికి ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని విగ్నేష్‌ అప్పవు వివరించారు.
Next Story