విద్యార్థుల జీవితాలతో ఆటలా: మండిపడ్డ ఏపీ హైకోర్టు

బిఇడి అభ్యర్థులు ఎస్‌జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ డిఎస్‌సిలో ఇచ్చిన నిబంధనలపై స్టే విధిస్తూ బుధవారం ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది.


విద్యార్థుల జీవితాలతో ఆటలా: మండిపడ్డ ఏపీ హైకోర్టు
x
Andhra Pradesh High Court

జి విజయకుమార్‌

బిఇడి అభ్యర్థులకు ఎస్‌జిటి పోస్టుల్లో ప్రభుత్వం అవకాశం ఇవ్వడంపై స్టే
తక్కిన పరీక్షలు యథాతధం
డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో బిఇడి అభ్యర్థులను ఎస్‌జిటి పోస్టులకు కూడా అర్హతను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు తప్పు బట్టింది. ఆ మేరకు ప్రభుత్వం బీఈడీ వారిని ఎస్‌జీటీకి దరఖాస్తు చేసుకునే రూల్‌పై హైకోర్టు బుధవారం స్టే విధించింది. బిఇడి అభ్యర్థులను ఎస్‌జిటి పోస్టులకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.
ఎస్‌జిటి పోస్టుల్లో బీఈడీ వారికి కూడా అవకాశం కల్పిస్తూ డిఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు విద్యా శాఖ ఒక సర్కులర్‌ జారీ చేసింది. దీంతో డిఎస్సీలో ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులకు అర్హత వచ్చింది. గతంలో ఎస్‌జీటీ పోస్టుల్లో బీఈడీ వారికి అర్హత లేదని జీవో కూడా ఉంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఈ అంశాన్ని సవాలు చేస్తూ ప్రకాశం జిల్లా నుంచి సురేష్‌ అనే నిరుద్యోగితో పాటు మరి కొందరు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు రోజుల పాటు విచారించిన హైకోర్టు బిఇడి అభ్యర్థులను ఎస్‌జిటి పరీక్షలకు అనుమతించేది లేదంటూ తీర్పునిచ్చింది.
పిటీషనర్ల తరపున న్యాయవాదులు జడ శ్రావణ్‌కుమార్, ఆదినారాయణలు వాదనలు వినిపిస్తూ ఎస్‌జిటి పోస్టుల భర్తీలో బిఇడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీం కోర్టు నిబంధలకు విరుద్దమన్నారు. బిఇడి అభ్యర్థులను అనుమతించడం వల్ల 10 లక్షల మంది ఎస్‌జిటి అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం నియామక ప్రక్రియను చేపట్టిందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న హై కోర్టు ధర్మాసనం సుప్రీం కోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా అమలు కావాలి కదా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో ఏజి శ్రీరామ్‌ సమాధానమిస్తూ హాల్‌ టిక్కెట్లను ఈ నెల 22 నుంచి జారీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టుకు వివరాలు సమర్పించేందుకు బుధవారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఈ కేసును బుధవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. ఏజి శ్రీరామ్‌ ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తూ బిఇడి అభ్యర్థులను ఎస్‌జిటి పోస్టులకు అనుమతించబోమని కోర్టుకు తెలిపారు. దీంతో బీఇడీ వారు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే రూర్‌లు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం స్టే విధించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జడ శ్రావణ్‌కుమార్, ఆదినారాయణలు వాదనలు వినిపించారు.
Next Story