
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయమన్న ఈసీ
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల పండుగ రానుంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల పండుగ రానుంది. గడువుకు 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సెప్టెంబర్ 3న ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఆదేశాల ప్రకారం..
అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులకు ఆదేశించారు.
‘బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలకు ఊతమిస్తాం. ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ చేపట్టాలి. ఆర్ధిక వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. పంచాయతీ రికార్డుల ఆన్ లైన్ చేయాలి’అని డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ సూచించారు.
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
స్థానిక సంస్థల స్వయం సమృద్ధే లక్ష్యం: పవన్ కల్యాణ్
‘పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలి. పంచాయతీల నిర్వహణకు ఏ మేరకు అవసరాలు ఉన్నాయో గుర్తించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏ విధంగా సాయం అందించాలి...? స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి...? అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలు కలుగుతుంది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
‘కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే నిధులను కొంత మేర పెంచితే వాటిని స్థానిక సంస్థలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వనరులు తక్కువగా ఉండి... సామాజికంగా వెనకబడి ఉన్న స్థానిక సంస్థల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ‘ఇదే సమయంలో స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా అవగాహన కల్పించాలి. నిధులు తీసుకోవడంతో పాటు, వాటిని సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించేది స్థానిక సంస్థలు. దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు విధులు నిర్వర్తించాలి. స్థానిక సంస్థల్లో విధులు నిర్వహించే వారు సమర్థవంతంగా పని చేస్తే... ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆర్ధిక సంవత్సరం చివరికి పంచాయతీల్లోనూ, పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ ఆడిటింగ్ పూర్తి చేయాలి.’డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆదాయాలు-బకాయిల లెక్కలు తేల్చండి: పవన్ కల్యాణ్
2019 నుంచి 2024 మధ్య కాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూళ్లు ఎంత జరిగాయి...? ఇంకెంత బకాయిలు ఉన్నాయో...? లెక్కలు తేల్చాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతీది ఆన్లైన్ చేయాలని నిర్దేశించారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
‘ఆర్ధికంగా రాష్ట్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం పేర్కొంది. 2023-24 ఆర్ధిక సంవత్సరాన్ని పరిశీలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం కన్నా జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకు ఖర్చు పెట్టే మొత్తం 111 శాతంగా ఉందని వెల్లడించింది.’అని సీఎం చంద్రబాబు అన్నారు.
2025-26 నుంచి 2029-30 వరకు పంచాయతీరాజ్ సంస్థల రిసోర్స్ గ్యాప్ రూ.7,033 కోట్లు ఉంటుందని ఆర్ధిక సంఘం లెక్క తేల్చింది. అలాగే ఇదే కాలానికి పట్టణ స్థానిక సంస్థల రిసోర్స్ గ్యాప్ రూ.2,016 కోట్లుగా ఉంది. అలాగే ఆస్తి పన్నుల డిమాండ్-కలెక్షన్ మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పింది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లులు చెల్లించని గత ప్రభుత్వం: సీఎం
‘జూన్ 2024 వరకు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు రూ.5,851.58 కోట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ రూ.2,617 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న గ్రాంట్స్ రూపంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆస్తి పన్నులతో ఎక్కువ నిధులు సమకూరుతున్నాయి.’అని సీఎం చెప్పుకొచ్చారు. పంచాయతీరాజ్ సిబ్బందికి ఏటా జీతాల రూపంలో రూ.393.77 కోట్లు, మున్సిపల్ సిబ్బందికి రూ.1,672.45 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Next Story