అనుకున్నంతా అయింది, అనుమానిస్తున్నట్లే అవుతుందా?
అవును అనుకున్నది జరిగింది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వాయువేగంతో అమలులోకి వచ్చింది.

అంతా కాంగ్రెస్ మంచికేనని కాంగ్రెస్ వాదులు అంటుంటే, ఈ సముద్ర హోరులో ఏపార్టీ మునుగుతుందోననే అందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. అన్నా చెల్లెలు మధ్య పోరు తప్పనిసరి పరిస్థితైంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వారే వస్తారు. ఇప్పటికే వైఎస్సార్సీపీలో ఎక్కువ మంది అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలకు వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయింది. మంత్రులు కూడా మాట్లాడేందుకు వీలు లేదు. ఎవరిని మాట్లాడమంటే వారు మాత్రమే మీడియా ముందు మాట్లాడాలి. ఒంటెత్తు పోకడలతో వైఎస్సార్సీపీలో ఉగ్గబట్టుకుని ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ వారు అంటున్నారు. వైఎస్సార్కు నమ్మిన బంట్లుగా ఉన్న వారు ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరుతారు. కాంగ్రెస్ నేషనల్ పార్టీ. ఇందులో వాక్ స్వాతంత్య్రమే కాదు స్వేచ్ఛ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు అలాగే పార్టీ నడిచింది. ఇక ముందు కూడా అలాగే నడుస్తుందనే అభిప్రాయంలో చాలా మంది నాయకులు ఉన్నారు.