ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా మాజీ ఎంపీ, కొనకళ్ల నారాయణ, ఏపీ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాలాజీ శనివారం బాధ్యతలు స్వీకరించారు.


తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నాయారణ ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలు పూల బొకేలు అందించి కొనకళ్ల నారాయణను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కొనకళ్ల నారాయణ టీడీపీలో చాలా సీనియర్‌ నాయకుడు. కృష్ణా జిల్లాలో ఆయనకు మంచి పట్టుంది. గతంలో రెండుసార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా ఈ సారి ఎన్కిల్లో కొనకళ్లకు పరిస్థితులు కష్టంగా మారాయి. పొత్తుల నేపథ్యంలో ఈ సారి ఆయనకు టిక్కెట్‌ దక్క లేదు. ఆయనకు బదులుగా సిట్టింగ్‌ ఎంపీ వల్లభనేని భాలశౌరికి జనసేన అభ్యర్థిగా ఎంపీ సీటు కేటాయించారు. దీంతో టీడీపీ అధిష్ఠానం కొనకళ్లను తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ ఛైర్మన్‌గా నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాలాజీ ప్రస్తుతం ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీలో ఈయన కూడా సీనియర్‌ నేతగానే ఉన్నారు.



Next Story