
కడప మేయర్ ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ?
వైసీపీ అభ్యర్థిగా పాకా సురేశ్ పాగా వేసినట్టేనా? టీడీపీపై వైసీపీ పైచేయి సాధించినట్టేనా?
కడప మేయర్ ఎన్నికపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరగబోయే మేయర్ ఎన్నికకు
కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎత్తుగడలను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది.
కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేసినట్టు వైసీపీ ఆరోపించింది..
మేయర్ సీటుకు ఎవరెవరు పోటీ పడ్డారంటే...
మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోందని టీటీపీ నేతలు ఆశించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యరి్థగా ప్రకటించారు.
కడప మేయర్గా ఉన్న సురేష్బాబును ప్రభుత్వం ఇటీవల తొలగించింది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం వైసీపీ పార్టీ నేతలు కసరత్తు చేసి సఫలీకృతులు కావడంతో మేయర్ ఎన్నిక గురువారం నాడు లాంఛనంగా పూర్తి కానుంది. బలం లేని కారణంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదివరకే ప్రకటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పాకా సురేష్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
పాకా సురేను గొప్ప ఆధిక్యతతో గెలిపించాలి ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి పాకా సురేష్ కుమార్ను కార్పొరేటర్లు అందరూ గొప్ప అధిక్యతతో గెలిపించాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కడపలోని తన నివాసంలో మేయర్ ఎంపికపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎవరిని మేయర్గా నిలబెట్టాలన్న అంశంపై అందరితో సమాలోచనలు చేసి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం పాకా సురేష్ను వైఎస్సార్సీపీ తరుపున మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు.
కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతకు ఎంపీపీగా అవకాశం ..
ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డా. సుదీర్రెడ్డిలతో సమాలోచనలు చేశామని ఎంపీ తెలిపారు. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఏకాభిప్రాయంతో మేయర్ అభ్యర్థి ఎంపిక: రవీంద్రనాథ్రెడ్డి
ఏకాభిప్రాయంతో కడప మేయర్ అభ్యర్థి ఎంపిక చేశామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లలో ముగ్గురు మేయర్ పదవి ఆశించారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పాకా సురేష్ను ఏక గ్రీవంగా ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని టీడీపీ పాచిక వేసిందని, కార్పొరేటర్ల ఐక్యత ముందు అది పారలేదని తెలిపారు.
తనను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాకా సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

