CM Chandrababu | టీడీపీలో ఫైబర్ నెట్ ఎలాంటి తుపాను రేపిందంటే...
x

CM Chandrababu | టీడీపీలో ఫైబర్ నెట్ ఎలాంటి తుపాను రేపిందంటే...

మారాను అన్నారు. నమ్మండిని కోరారు. అధికారంలోకి వచ్చాక సీఎం తీరే మళ్లీ ఇలా ఉందే. మా పరిస్థితి ఏమిటంటున్న టీడీపీ క్యాడర్.


జాతీయ అధికార ప్రతినిధి, ప్రాథమిక సభ్యత్వంతో సహా ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి. రెడ్డి రాజీనామాతో కూటమి ప్రభుత్వం. ప్రధానంగా టీడీపీ ఆత్మరక్షణలో పడింది. టీ కప్పులో తుఫానులా చల్లార్చాల్సిన వ్యవహారానికి ఆజ్యం పోశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక ప్రభుత్వ కార్పొరేషన్లలో అధికారుల పెత్తనం వల్ల ప్రకంపనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మిగతా చైర్మన్లలో ఆత్మస్థైర్యం దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. సమన్వయం కుదర్చాలి.

గత ఏడాది నవంగర్ 15 వ లేదీ జీవీ.రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల్లోనే ఆయన అనేక విషయాలు బయటపెట్టడంతో పాటు ప్రక్షాళన చేయాలనే వేగానికి కళ్లెం వేసినట్టు మారింది. దీంతో "సీఎం చంద్రబాబు మారని మనిషి" అనే మాటను తలపిస్తున్నాయి. "అధికారుల పక్షపాతిగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతీసేవిగానే ఉన్నాయి" అనే ఆపవాదు ఎదుర్కొంటున్నారు.


విశ్లేషకుడు అప్పసాని రాజేష్ ఓ చర్చలో మాట్లాడుతూ,

"జీవి.రెడ్డి ప్రక్షాళన జరగాలని కోరుకున్నారు. ఆత్మగౌరవ సమస్య ఎదురైంది" అని అన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన టీడీపీ అంకితభావంతో పనిచేసే కార్యకర్తకు ఎదురుదెబ్బ తగిలింది. సీఎం చంద్రబాబు చైర్మన్, ఎండీ మధ్య సమన్వయం చేయాల్సింది. ప్రతి సందర్భంలో కార్యకర్తలు తనకు ప్రాధాన్యం అని చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా చెప్పారు. ఈ రోజు ఆ కార్యకర్త ఎక్కడికి వెళ్లారు. అధికారులు ముందుకు వస్తున్నారు" అని గుర్తు చేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికారులకే సీఎం ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి సీఎం అయిన సందర్భంలో ఆకస్మిక తనిఖీలతో సీఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టించారు. జన్మభూమి కార్యక్రమంతో పార్టీ క్యాడర్ కు విశ్రాంతి లేకుండా చేశారు. ఆ తరువాత టెలిఫోన్, వీడియో కాన్ఫరెన్స్ తో జిల్లా అధికారులతో నేరుగా సంప్రదింపులు సాగించడం, టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక గగ్గోలు పెట్టారు.
"పనులపై కలెక్టర్, ఎస్పీల వద్దకు వెళితే.. మేము సీఎంతో మాట్లాడి చెబుతాం" అనే సమాధానంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఇదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ఒత్తిడి తట్టుకోలేని ఓ ఇంజినీర్ ఇన్ చీఫ్ గుండెపోటుతో మరణించిన సంఘటన కలకలం రేపింది. అయినా, తన పంథాలో సాగిన చంద్రబాబు 2003లో తిరుపతి అలిపిరి సమీపంలో ల్యాండ్ మైన్ల దాడికి గురయ్యే వరకు సాగించారు.
ఏకపక్ష నిర్ఱయంతో..
2004లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ సంఘటన తరువాత సానుభూతి పవనాలు అనుకూలంగా ఉంటాయని భావించి, పార్టీలో చర్చలేకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి, భంగపడ్డారు. వరుసగా పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ సమయంలో హైదరాబాద్ ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో పార్టీ క్యాడర్ చంద్రబాబుపై తీరుపై నిప్పులు చెరిగింది. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే " ఔను నా వల్లే తప్పు జరిగింది. నన్ను నమ్మండి నేను మారతాను. ఇకపై సమష్టి నిర్ణయాలు తీసుకుందాం" అని క్యాడర్ ను దాదాపు బతిమాలినంత పనిచేశారు.
2014 ఎన్నికల్లో కూడా నన్ను నమ్మండి. పార్టీ క్యాడర్ కు గుర్తింపు, ప్రాధాన్యత ఇస్తా. అని ఎన్నికల
2009 ఎన్నికల్లో సీట్ల పంపిణీలో మళ్లీ పాత పద్ధతే అనుసరించారు.
2014లో బీజేపీ మిత్రపక్షంగా సీట్ల కేటాయింపులో టీడీపీ కోటలను వదులుకుని తప్పు చేశారనేది టీడీపీ నేతల విశ్లేషణ. అది వాస్తవం కూడా.
2019 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించి, అధికారం పోయిన విషయాన్ని కూడా పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
2014లో టీడీపీ అధికారంలో ఉండగా తిరుపతిలో జరిగిన టీడీపీ మహానాడులో అనంతపురం మాజీ ఎంపీ జేసీ. దివాకరరెడ్డి వేదికపైనే తనదైన శైలిలో దుమ్ము దులిపిన సంఘటన ప్రస్తావనార్హం. "అయ్యా చంద్రబాబు సార్.. ముందు నువ్వు ఆ వీడియో కాన్ఫరెన్సులు ఆపు సామీ. మా మాట ఒక్కడు వినడం లేదు. ఏదన్నా సిఫారసు చేస్తే, మేము సీఎంతో మాట్లాడతాం" అని అంటున్నారని జేసీ నిరసన వ్యక్తం చేశారు. " టీడీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలంటే మీరు మారాలి సార్" అని బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇదెలా ఉంటే... తాజాగా
చర్చకు దారితీసిన ఘటన
ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber net) చైర్మన్ గా నియమితులైన జీవి.రెడ్డి (జీ. వెంకటరెడ్డి) ఆ సంస్థ జరుగుతున్న అక్రమాలు, వేతనాల చెల్లింపు వంటి అంశాలను బయటపెట్టారు. సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగానే ఆలోచలు సాగించారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా, ఆ సంస్థ ఎండీ (Managing Direcor ) దినేష్ మధ్య సఖ్యత కొరవడింది. రాజకీయ ప్రతినిధిగా ఉన్న చైర్మన్ హోదాలో ఉన్న జీవి.రెడ్డి ఆదేశాలు అమలు చేయని స్థితిలో, వారిద్దరి మధ్య యుద్ధమే సాగిన విషయం తెలిసిందే. సహనం నశించి...
"సంస్థలో ఉద్యోగులు సహకరించడం లేదు. తొమ్మిది నెలలుగా పురోగతి లేకపోగా, ఒక కనెక్షన్ పెరగలేదు. దీంతో ఆదాయం లేకుండా పోయింది. ఎండీ దినేష్ పనితీరుగా బాగా లేదు" అని జీవి.రెడ్డి మీడియా ముందు ఆరోపణలు చేశారు.
"వైసీపీ ప్రభుత్వంలో నియమితులై, పనీపాటా లేకుండా జీతం తీసుకుంటున్న 610 మంది ఉద్యోగులను తొలగించండి" అని కూడా మాజీ చైర్మన్ జీవి. రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంస్థ టెక్నికల్ ఆఫీసర్ సత్యరాం భరద్వాజ్, బిజినెస్ అధిపతి గంధంశెట్ట సురేశ్, ప్రొక్యూర్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర ను విధుల నుంచి తొలిస్తున్నామని ప్రకటించారు. దీనిని ఏమత్రం ఖాతరు చేయని ఫైబర్ నెట్ ఎండీ దినేష్, ఈడీ (Excutive Director) ఆదేశాలపై సంతకాలు చేయకపోగా, గత ఏడాది డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు వేతనాలు చెల్లించడాన్ని కూడా జీవిరెడ్డి ఆక్షేపించడమే కాదు. "ఎండి దినేష్ రాజద్రోహానికి పాల్పడ్డారు" అనే వ్యాఖ్యలు ఐఏఎస్ ల ఆగ్రహానికి గురి చేసింది. ఆ తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడిన తరువాత జీవి.రెడ్డి తన పదవి, అధికార ప్రతినిధి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జీవి.రెడ్డి అర్ధంతరంగా పదవి, పార్టీ నుంచి నిష్క్రమించడం, టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది.
బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ..
"కూటమి ప్రభుత్వంలో వైఎస్. జగన్ కు మేలు చేయడానికే చాలా మంది అధికారులు పనిచేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. వారిని మిగతా శాఖలకు బదిలీ చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. లేదంటే మరింత నష్టం జరుగుతుంది. పార్టీ పెద్దల ద్వారా సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు యత్నిస్తామని భాను ప్రకాష్ చెప్పారు.
బాబు మార్క్ ఎలాగంటే..
1984 ఆగష్టు 16న ఉమ్మడి రాష్ట్రంలో సీఎ ఎన్.టీ.రామారావు చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో కాంగ్రెస్ తో చేతులు కలిపిన నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని అధికారం దక్కించున్న ఎపిసోడ్ లో ఎన్. చంద్రబాబునాయుడు ట్రబుల్ షూటర్ గా నాదెండ్ల ఎత్తును అసెంబ్లీలో తిప్పికొట్టడం ద్వారా టీడీపీ ప్రభుత్వాన్ని నిలిపారు. తన అల్లుడు రాజకీయ చాతుర్యాన్ని మెచ్చిన ఎన్టీరామారావు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం ప్రస్తావనార్హం. ఆ ఏడాదే జరిగిన ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు ప్రారంభించిన రాజకీయ రెండో ఇన్నింగ్ సాగుతూనే ఉంది.
1994లో లక్ష్మీపార్వతి ప్రాబల్యాన్ని దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వాన్ని, పార్టీని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించడంలో ఎక్కడి వెనుదిరిగి చూడలేదు.
ఈ రెండు సంఘటనల్లో మనకు అర్థం అయ్యేది ఒకటే.. "రాజకీయంగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా చాకచక్యంగా నివారించడంలో చంద్రబాబు దిట్ట" అనే పేరుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. లేనిది కూడా ఉన్నట్లు భ్రమింప చేసి, వ్యవస్థలను సాగించడంలో ఆయనకు విభిన్న శైలి అంటారు.
రాష్ట్ర విభజన తరువాత ఓ టీవీ ఛానల్ జిల్లాల వారిగా నిర్వహించిన డిబేట్ లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నారంటే... "చంద్రబాబు ఈజ్ ఏ గుడ్ మానుప్లేటర్" అని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడి "మాన్యుప్లేటర్ అంటే నెగటివ్ అర్థం కాదు. పాజిటివ్ మాటే" అని కూడా ఉండవల్లి వివరించిన సంఘటన కూడా ప్రస్తావనార్హం.
నమ్మండి అన్నారు
గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా " నన్ను నమ్మండి" అని ప్రతి సభలోనూ సీఎం చంద్రబాబు పదేపదే కోరారు. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి టీడీపీ 135 స్థానాలు, జనసేన 21, బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. వారిలో 83 మంది మొదటిసారి గెలిస్తే యువతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మంత్రులే కాకుండా, కార్పొరేషన్ చైర్మన్లుగా యువకులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఎక్కువ మంది సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మద్దతుదారులే అనే మాట బలంగా వినిపిస్తోంది.
బాబు తీరు మారలేదా...
ప్రతి ఎన్నికల్లో సీఎం చంద్రబాబు అనుసరించే పద్ధతి. చేసే వ్యాఖ్యాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షేక్ హ్యాండ్లు, ఆలింగనాలు, కార్యకర్తలకు దగ్గరికి వెళ్లడం, మాట్లాడడం వంటి చర్యలతో "చంద్రబాబు మారిన మనిషే" అని అందరూ అనుకునే లోపే..
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో పెద్దబంద పడింది. ఈ సంఘటనపై టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ శ్యామలరావుతో జరిగిన సమీక్ష దుమారం రేపింది.
సీఎం సమక్షంలోనే చైర్మన్, ఈఓ వాదులాడుకోవడం. చైర్మన్ నాయుడును ఉద్దేశించి ఈఓ శ్యామలరావు నువ్వు.. నువ్వు అని సంబోధించారనే వ్యవహారంలో ఇద్దరు ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో కూడా సీఎం చంద్రబాబు టీటీడీ ఈఓకు మద్దతుగానే నిలిచి, కలసి పనిచేయాలని హితోపదేశం చేశారు. తాజాగా ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవి. రెడ్డి వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. సీఎం చంద్రబాబు అధికారుల పక్షంగా వ్యవహరించడం పార్టీ క్యాడర్ ప్రధానంగా ప్రజాప్రతినిధులు, వారికి సమాన క్యాబినెట్ హోదాకు తగిన పదవుల్లో ఉన్న నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుడు అప్పసాని రాజేశ్ ఏమన్నారంటే..
ఉమ్మడి రాష్ట్రంలో కూడా "గుంటూరు కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఉన్న రోజుల్లో టీడీపీ మేయర్ ఏసురత్నంను అరెస్టు చేయించారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రవీణ్ ప్రకాష్ ను సమర్థించారు. ఆ తరువాత ప్రవీణ్ ప్రకాష్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఏమి చేశారు? వారి నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది చూశాం" అని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల వేళ చెప్పే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఏమైంది" అని ఆయన ప్రశ్నించారు. "జీవి రెడ్డి ఎపిసోడ్ లో టీ కప్పులో తుఫానులా పరిష్కరించాల్సిన సమస్యను మరింత జఠిలం చేశారు. మిగతా ప్రతినిధుల పరిస్థితిని కూడా ఇబ్బందుల్లో పడేశారు" అని అన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత సీఎం సమక్షంలోనే టీటీడీ చైర్మన్ నాయుడును ఈఓ శ్యామలరావు నువ్వు.. నువ్వు అని సంబోధించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ప్రజలతో ఎన్నికై, ప్రభుత్వంతో నియమించిన చైర్మన్ అంటే ప్రజాప్రతినిధులే. ప్రజాపక్రతినిధులకంటే అధికారులు సుపీరియర్లా? అలా అయితే ప్రజాస్వామ్యం అవుతుందా? అధికారి అవమానిస్తున్నారు. అక్కడే ఈఓను కట్టడి చేసి ఉంటే మిగతా అధికారులు కాస్త బెత్తుగా ఉండేవారన్నారు.
టీడీపీ క్యాడర్ లో డైలామా..
ఫైబర్ నెట్ చైర్మన్ జీవి. రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో చురుగ్గా వ్యవహరించారు. టీడీపీ ప్రతిపక్షం లో ఉండగానే ఆయన ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గణాంకాలతో సహా ప్రత్యర్థి పార్టీ నేతలను కట్టడి చేయడంలో చిన్నవయసులో మేథస్సు చాటే వారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ గా సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. చిత్తశుద్ధితో పనిచేస్తారు. మాట్లాడతారనే పేరు సంపాదించుకున్న జీవీ.రెడ్డి ఆడిటర్, న్యాయవాదిగా కూడా మంచి అనుభవం సాధించారు. అయితే.
సీఎం చంద్రబాబు మానసపుత్రిక ఫైబర్ నెట్ లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాలను జీవీ. రెడ్డి బయటపెట్టారు. సీఎం చంద్రబాబుకు ఆయనతో పాటు ఆ సంస్థ ఎండీ దినేష్ మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో "నేను కార్తకర్తకు ప్రాధాన్యం ఇస్తా" అని చెప్పిన మాటకు భిన్నంగా సీఎం అధికారి పక్షం వహించారు" అనే అపవాదుకు గురయ్యారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో రెండు సంఘటనల సందర్భంగా కూడా పార్టీ ప్రతినిధులే ఇబ్బంది పడ్డారు. దీనిద్వారా చంద్రబాబు పద్ధతి మార్చుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే.. మమ్మలిని ఖాతరు చేసే అధికారి ఉం డరేమో అని మిగతా కార్పొరేషన్ చైర్మన్ల అంతర్మథనానికి గురవుతున్నారు.
ఫైబర్ నెట్ ఘటన ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసినట్లే భావిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు మాటలకు పదవిలోకి వచ్చాక చేసే తీరులో చాలా వ్యత్యాసం ఉంటోందనే భావన వ్యక్తం అవుతోంది.
దీనిపై రాయలసీమ నుంచి మంత్రి నారా లోకేష్ కోటరీలో గెలిచిన ఓ యువ ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు త్వరలోనే చక్కదిద్దుతారు" అని వ్యాఖ్యానించారు. అయితే
"ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు మదిలో నుంచి పుట్టింది. ఇక్కడి విషయాలన్నీ ఆయనకు తెలుసు. జీవి.రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేయాలని భావించలేదు. ఇందులో సీఎం చంద్రబాబు లౌక్యం అర్థం చేసుకోవడంలో తొందరపాటుకు లోనయ్యారు" అని జీవి. రెడ్డి నిర్ణయాన్ని విశ్లేషిస్తున్న వారు చెప్పే మాట. సీఎం చంద్రబాబుకు జీవి.రెడ్డి సమర్థతపై ఏపాటి నమ్మకం ఉందో.. ఎండీ దినేష్ కుమార్ పై కూడా అదే స్థాయిలో నమ్మకం ఉందనేది విశ్లేషకుల మాట. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రతిపక్షంలో మాదిరే దూకుడు అవసరం లేదంటున్నారు. లౌక్యంతో అధికారులను సమన్వయం చేసుకునేందుకు కాస్త సమయం తీసుకుని ఉంటే, ప్రభుత్వం, పార్టీ కార్యాచరణ అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందనే మాట కూడా ఉంది.
కూటమి పాలనలో ఎదురవుతున్న వ్యవహారాలు క్యాడర్ లో ఆందోళనకు కారణం అవుతున్నట్లు భావిస్తున్నారు. ఈ తుఫానును సీఎం చంద్రబాబు ఎలా చల్లారస్తారనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story