ప్రజలు చంద్రబాబును, పవన్ కల్యాణ్లను భారీ మెజారిటీతో గెలిపించారు. గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు. వారి మీద మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. అగౌరవంగా మాట్లాడితే సహించేది లేదు. కించపరిచే విధంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో కూటమి ఎమ్మెల్సీలు గెలిచారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి భయం పట్టుకుంది. దీంతో బెంగుళూరు నుంచి హడావుడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రెండు రోజులు ఉంటారు. రెండు రోజుల తర్వాత బెంగుళూరుకు వెళ్లిపోతారు అని లోకేష్ జగన్ మీద మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద నిప్పులు చెరిగారు. చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని ప్రశ్నించారు. చట్టాన్ని ఉలంఘించడం జగన్కు బాగా అలవాటే. అందుకే జగన్ మీద అన్ని కేసులు ఉన్నాయని అన్నారు.
రూల్స్ ఏమి చెబుతున్నాయి. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ పది శాతం సీట్లు ఉండాలి అని రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో జగనే చెప్పారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను తాను లాగేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగనే చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్కు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. అసెంబ్లీకి జగన్తో పాటు వారి ఎమ్మెల్యేలు రావాలి. ప్రజల సమస్యలపై చర్చిద్దాం. సంఖ్య ప్రకారం వారికీ సమయం వస్తుంది. ఆ ప్రకారం వారూ మాట్లాడొచ్చు అని మాట్లాడారు. ప్రతి సభ్యునికి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మైక్ ఇస్తున్నారని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదా జగన్కు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరిగాయో తెలిసే దానికి, వెళ్లి బెంగుళూరులో పడుకొని ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడితే ఆశ్చర్యంగా లేదా అని ప్రశ్నించారు.
జగన్మోహన్రెడ్డి పొలిటీషియన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. తాను కూడా పాదయాత్ర చేశానని, ప్రతి ఒక్కరిని కలిసేందుకు ప్రయత్నిస్తానని, కానీ జగన్ను ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులను కూడా కలవరని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పార్టీకి చెందిన 20 మందికిపైగా ఎమ్మెల్యేలు ఐదేళ్లల్లో జగన్ను కలువడానికి అపాయింట్మెంటే దొరకలేదంటే ఇక ఆయన పొలిటీషియన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల తర్వాత కూడా సొంత కార్యకర్తలను, నాయకులకు కూడా జగన్ కలవడం లేదని అన్నారు. అహంకారానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్లా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా విధానం నాశనం చేశారని విమర్శలు గుప్పించారు.