కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ పథకం గురించి వివరించారు.


'పీఎం సూర్య ఘర్‌' యోజన పథకంకపై ప్రజల్లో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్లు, ఇన్‌స్టాలేషన్‌లు పెరిగేలా చూడాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ పథకం కోసం నేషనల్‌ పోర్టల్‌ ద్వారా ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద 6.39 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 77.09 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 6.5 వేల ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా కేంద్రం ఒక్కో కిలో వాట్‌కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు రాయితీ ఇస్తుందన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్దిదారులకు ఏపీఈపీడీసీఎల్‌ కింద రూ.10.88 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌ కింద రూ.7.74 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద రూ.6.64 కోట్లను మొత్తంగా రూ.25.27 కోట్లను సబ్సిడీగా విడుదల చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం గృహోపకరణాల కింద ఉచితంగా ఇన్‌స్టాలేషన్‌ చేపట్టాలని యోచిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈపీడీసీఎల్‌ కింద 6, 77, 146 మంది, ఏపీసీపీడీసీఎల్‌ కింద 5,9,587 మంది, ఏపీఎస్పీడీసీఎల్‌ కింద 7,42,947 మంది మొత్తంగా 20,17,947 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు. వీరితో రిజిస్ట్రేషన్‌లు చేయిస్తే ఒక గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఇన్‌స్టాలేషన్‌ల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు.
Next Story