ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితి డోలాయమానంలో ఉంది. దీనికి సమీపంలోనే ప్రైవేటు భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయాలని కూడా కార్యక్రమం ఖరారు చేశారు. దీంతో..
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం తెరమీదకి వచ్చింది. కడప ఉక్కు కూడా ఆంధ్రుల హక్కు అనే నినాదం ఊపు అందుకోక పోవడం వెనుక రాయలసీమ పులులుగా గర్జించే అధికార, ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలిలో డొల్లతనం మరో మారు బట్టబయలైంది.
రాయలసీమ ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.
సీమపై వివక్ష ఎందుకు?
అనకాపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ వ్యవహార తీరుపై.. రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
"రాయలసీమలో స్విచ్ వేస్తే కోస్తాలో బల్బు వెలుగుతోంది" అని నాగార్జున రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"కడపలో ఉక్కు కర్మాగారం ప్రారంభించాలని రాజ్యసభ సభ్యుడుగా సీఎం రమేష్ 2019లో ఆమరణ దీక్ష చేశారు. అలాంటి వ్యక్తి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తారంట" అని నిరసించిన నాగార్జునరెడ్డి "ఎందుకన్నా మీకు మన రాయలసీమ అంటే అంత కోపం? సీమపై ఎందుకు ఈ వివక్ష, సొంత గడ్డపై ఎందుకు మమకారం లేదు" అని కూడా నాగార్జున రెడ్డి ఎంపీ సీఎం రమేష్ సూటిగా ప్రశ్నించారు. ఆ దీక్షలో తాను మాట్లాడిన మాటలను నాగార్జునరెడ్డి గుర్తు చేశారు.
సీఎం రమేష్ ద్రోహం
"కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో కడప నుంచి టిడిపి రాజ్యసభ సభ్యునిగా, ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ద్రోహం చేశారు" అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటైన ఆరోపణ చేశారు.
ఆయన ఏమంటున్నారంటే..
"తప్పుడు నివేదికలతో ఓబులాపురం మైన్స్ లో ఉన్న ఖనిజంలో నాణ్యత లేదని కేంద్రానికి పంపిన మీరు (సీఎం రమేష్) ప్రస్తుతం ఒక్కొక్కటిగా మన రాయలసీమ ప్రాంతం నుంచి కోస్తాకు తరలిస్తూనే ఉన్నారు" అని ఆరోపించారు.
గత ప్రభుత్వం కూడా కడప ఉక్కు పరిశ్రమను నిర్మించ కుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారు. మీ రాజకీయ నాయకుల అండతో అక్రమ మైనింగ్ చేసుకోవడానికి, స్మగ్లింగ్ చేసుకోవడానికి మాత్రము నాణ్యత ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇక్కడ ఉన్న ఖనిజ సంపదతో నిర్మించడానికి పరిశ్రమలను విభజన చట్టంలో ఉన్న కూడా ఈ తల్లికి పుట్టిన నాయకులే కడప ఉక్కు పరిశ్రమను రాయలసీమ ప్రాంతంలో నిర్మించ కుండా మల్లీ మన రాయలసీమ ప్రాంత ప్రజలను ఎక్కిరించినట్లు, అవమానించినట్లు, కోస్తాలో ఏకంగా ప్రధానితో అక్కడ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడాన్ని సీ ఎమ్ రమేష్ గారి విఙ్ఙతకే వదిలేస్తున్నాం" అని తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప ఉక్కు పరిశ్రమను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. అనకాపల్లి నుంచి ఎంపీగా గా గెలిచిన తరువాత మొదటిసారి సొంత జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్ధనల తరువాత కూడా హామీ ఇచ్చారు. అయినా, విశాఖ- చెన్నై కారిడార్ లో భాగంగా అనకాపల్లి సమీపంలో నక్కల పల్లె వద్ద కర్మాగారం ఏర్పాటుకు అనుమతి సాధించారు. ఇదే జిల్లాలో చర్చకు తెర తీసింది.
రాయలసీమకు మేలు చేసేందుకు ఉద్దేశించిన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదటి నుంచి అవరోధాలే ఎదురవుతున్నాయి. 2004లో దివంగత సీఎం వైఎస్ఆర్ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే కడప జిల్లా మైలవరం సమీపంలో కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బీజం వేశారు.
కర్ణాటకలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) నుంచి ఇనుప ఖనిజం తీసుకోవడానికి బ్రాహ్మణి స్టీల్స్ తో 2007 నాటి ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చకుని, జమ్మలమడుగు సమీపంలోని అంబవరం వద్ద ఎనిమిది వేల ఎకరాలు కేటాయించడంతో పాటు గండికోట రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీళ్లు ముద్దనూరు థర్మల్ విద్యుత్ పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఉత్పత్తి చేసిన స్టీల్ తరలించడానికి, ఇనుప ఖనిజం తరలించడానికి వీలుగా ముద్దనూరు నుంచి రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అంగీకరించింది. వైఎస్ఆర్ మరణం తరువాత ఆ పనులు ఆగడమే కాదు. విపరీతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తరువాత బ్రాహ్మణి స్టీల్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడంతో పాటు 2013లో జీఓ నంబర్ 333 ఉత్తర్వులతో భూములు కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆగింది.
"తమ కంపెనీకి అనుమతి ఇస్తే, రెండేళ్లలో కర్మాగారం ఏర్పాటు చేస్తాం" అని ఓఎంసీ అధినేత గాలి జనార్దనరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా "బ్రాహ్మణి స్టీల్స్ ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశాం. అవి తిరిగి చెల్లిస్తే, స్టీల్ ప్లాంట్ నిర్వహణ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన ప్రతిపాదించిన విషయం ప్రస్తావనార్హం.
రాష్ట్రం విడిపోయాక..