ఆచంటలో ఆసక్తికర పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ మంత్రులు. ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు. అయితే ఓటర్లు ఎవరి ఆదరించి అక్కున చేర్చుకుంటారనేది పెద్ద చర్చగా మారింది.


జి. విజయ కుమార్

ఇద్దరు మాజీ మంత్రుతు ఆచంట నుంచి పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ నుంచి వారు పోటీ పడటం విశేషం. చెరుకువాడ శ్రీరంగనాధరాజు రెండు సార్లు గెలిచారు. మొదటి సారి అత్తిలి నుంచి గెలవగా రెండో సారి ఆచంట నుంచి గెలుపొందారు. రెండో సారి గెలిచిన తరువాత వైఎస్సార్‌సీపీలో సీఎం జగన్‌ మంత్రిపదవి ఇచ్చారు. పితాని సత్యనారాయణ మూడు సార్లు గెలిచారు. రెండు సార్లు ఆచంట నుంచి గెలవగా ఒకసారి పెనుగొండ నుంచి గెలిచారు. కాంగ్రెస్‌లో ఒకసారి, తెలుగుదేశం పార్టీలో మరోసారి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆచంట సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా శ్రీరంగనాధరాజు ఉన్నారు. తిరిగి ఆయనకే వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చింది.

మహామహులు గెలిచారు..
ఆచంటకు 13 సార్లు ఎన్నికలు జరిగితే సీపీఐ ఒకసారి, కాంగ్రెస్‌ రెండు సార్లు, కాంగ్రెస్‌ఐ రెండు సార్లు, సీపీఎం మూడు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైఎస్సార్‌సీపీ ఒక సారి గెలుపొందాయి. 2004 వరకు ఎస్సీ రిజర్వుడు నియోవకర్గం. పదిసార్లు ఎస్సీలకే అవకాశం వచ్చింది. ఆ సమయంలో పీతల సుజాత, దాసరి పెరుమాళ్లు మంత్రులు అయ్యారు. జనరల్‌గా మారిన తరువాత ప్రస్తుత పోటీదారులిద్దరూ మంత్రులుగా పనిచేశారు.
ఆచంట ఓటర్లకు ఇద్దరిపై అభిమానమే..
పితాని సత్యనారాయణ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గం నుంచి సుమారు 50వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే పితాని బలమని నియోకజకవర్గానికి చెందిన రాజకీయ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీరంగనాధరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గం నుంచి చెప్పుకునేంత మంది ఓటర్లు లేకపోయినా రాజు మంచితనం, ఖర్చుపెట్టే తత్వం ప్రజలకు బాగా నచ్చుతుందనే అభిప్రాయం అక్కడి ఓటర్లలో ఉంది.
పితానికి తలనొప్పిగా మారిన వర్గపోరు..

2019లో జరిగిన ఎన్నికల్లో ౖవైఎస్సార్‌సీపీ నుంచి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు విజయం సాధించారు. ఆయనకు 63,549 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పితానికి సత్యనారాయణకు 59,629 ఓట్లు వచ్చాయి. అంటే చెరుకువాడ శ్రీరంగనాధరాజు 12,886 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన జవ్వాది వెంకట విజయరామ్‌కి 13,993 ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశానికి సీటు దక్కడంతో మళ్లీ పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలో వర్గపోరుతో పితానికి తలనొప్పులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీకి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ పెద్ద షాక్‌ ఇచ్చారు. ఇటీవలె ఆయన పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. అయితే వైఎస్సార్‌సీపీలో కూడా వర్గ పోరు మొదలైంది. గోవిందరాజు, వైట్ల కిషోర్‌లను సస్పెండ్‌ చేయాలని చెరుకువాడ వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.
శెట్టిబలిజలు శాసిస్థారా?
ఈ నియోజకవర్గం పరిధిలో ఆచంట,పెనుమంట్ర, పోడూరు,పెనుగొండ మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 1,66,421 ఉండగా ఇందులో పురుషులు 82,547 మంది కాగా, మహిళలు 83,866 మంది ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే శెట్టిబలిజలు 50 వేల మంది వరకు ఉన్నారు. ఎస్సీలు 30 వేలు, కాపులు 27 వేల మంది ఉన్నారు. దీంతో గెలుపు ఓటముల్ని శాసించేది శెట్టిబలిజలేననే టాక్‌ నియోకవర్గంలో ఉంది. ఆచంట నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. కాకపోతే కులాల వారీగా, పార్టీల వారీగా, ఎమ్మెల్యే అభ్యర్థుల పరంగా ప్రజలు విడిపోతుంటారు. కానీ చివరికి సామాజిక వర్గం, ధన బలమే ఇక్కడ గెలుస్తూ ఉంటుందన్న వాదన కూడా బలంగా విన్పిస్తోంది. మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నాయకులు వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం నుంచి పోటీ పడుతున్నారు.
Next Story