వైసిపిలో ఐదు కుటుంబాలకు స్పెషల్ క్యాటగరి స్టేటస్, ఆ కధేంటంటే...

ఆంధ్రాలో రాజకీయ కుటుంబాలు బాగా వర్థిల్లుతున్నాయి. చాలా మంది తల్లితండ్రులు కొడుకుల కోసం ఎమ్మెల్యే సీట్లు ఖాళీ చేస్తున్నారు.


వైసిపిలో ఐదు కుటుంబాలకు స్పెషల్ క్యాటగరి స్టేటస్, ఆ కధేంటంటే...
x
సీఎం జగన్‌తో నూర్‌ ఫాతిమా

తన బిడ్డ గొప్పవాడు కావాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. ఆవిధమైన ఆలోచనలతోనే పెంచుతారు. సినిమాల్లో , రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. రెండు గ్లామర్ ఉన్న రంగాలు. అందువల్ల వారసులను ప్రవేశపెట్టాలని తల్లితండ్రులు, వారసత్వం అందుకోవాలని కొడుకులు ఆత్రంగా ఎదరుచూస్తుంటారు. తెలుగు సినిమాల్లో లాగానే ఈ మధ్య తెలుగు రాజకీయాల్లో కూడా వారసుల సందడి ఎక్కువయింది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఐదుగ్గురు యువనేతలు రంగ ప్రవేశం చేస్తున్నారు. తండ్రి రాజకీయాలను చూసి ఇన్ స్పైర్ అయ్యారు వీరంతా. వచ్చే ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలు గా పోటీచేసేందుకు వైసిసి అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లైన్ క్లియర్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఐదుగ్గురు పేరెంట్స్ తమ కుమారులకు వైఎస్సార్‌సీపీ పార్టీ అభ్యర్థులుగా సీట్లు ఇప్పించుకోవడంలో సక్సెస్‌ అయ్యారని చెబుతున్నారు. ఇప్పటికే కుమారులను రాజకీయాల్లో క్రియాశీలం చేశారు. కొడుకులు కూడా తాము అభ్యర్థులమన్నట్లు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. అయితే, కొన్ని చోట్ల వారికోసం సిటింగ్ లను తీసేసే పరిస్థితి వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందికరమయిన వ్యవహారం. ఇపుడు రంగ ప్రవేశం చేస్తున్నవారసులు ఎవరంటే.....

తిరుపతి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత


తిరుపతి ఎమ్మెల్యే, టీడీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు భూమన అభినయ్‌రెడ్డి 36 సంవత్సరాల యువకుడు. ప్రస్తుతం తిరుపతి పట్టణ డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. రాజకీయీల్లో తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుపతి, తిరుమలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ విషయంలో అభినయ్‌ చూపించిన చొరవ ప్రశంసనీయమయిందని ప్రజలు చెబుతున్నారు. మొత్తం 18 రోడ్లకు మాస్టర్‌ప్లాన్‌ తయారు చేస్తే ఇప్పటికే 14 రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద కూడా రోడ్లను విశాలంగా చేయడమే కాకుండా అహ్లాదంగా రూపొందించడంలో అభినయ్‌ చొరవ తీసుకున్నారు. అభినయ్ రాజకీయాల్లో తన స్థానం పదిలపర్చుకున్నారనే చెప్పాలి
రాజకీయాల్లో రాటుదేలిన మోహిత్‌రెడ్డి


చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి. . సింగపూర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి లండన్‌లోని వార్విక్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తుడా చైర్మన్‌గా, టీటీడీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ జోన్‌ యువజన విభాగం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పలు సార్లు కలిసి నియోజకవర్గ రాజకీయ విశేషాలు వివరించేవారు. ఆయన కార్యకలాపాల వల్ల చెవిరెడ్డికి ధీమా వచ్చినట్లుంది తాను తప్పుకుని వారసుడికి దారి చూపారు.
దూసుకుపోతున్న ఫాతిమా..


గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా కుమార్తె షేక్‌ నూర్‌ఫాతిమా. ఆమె కూడా చురుకుగా నియోకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీటెక్‌ చదువుకున్న ఫాతిమా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రశంసలందుకున్నారు. పార్టీ వర్గాలను కలుపుకుపోవడంలో ఎప్పుడూ ముందుంటారని ఆమెకు పేరుంది. సుమారు రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలను కలుస్తున్నారు. ఆరు నెలలుగా పూర్తి స్తాయిలో ముస్తఫా తన కుమార్తె నియోజకవర్గ రాజకీయ కార్యకలాపాల్లో తిరిగేలా చేశారు. అధిష్టానం నుంచి కూడా ఈ మేరకు సంకేతాలు అందటంతో నూర్‌ఫాతిమా ఇప్పటికే నియోజకవర్గాన్ని కలియ తిరుగుతూ ఉంది.
తండ్రి ప్రోత్సాహంతో రంగంలోకి సూర్యప్రకాష్‌


వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌ తూర్పుగోదావరి జిల్లా రాజకీయీల్లో నూతన స్టార్. మొదట రాజకీయాల్లో ఆసక్తి చూపకపోయినా, తండ్రి రాజకీయీల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం, వారసత్వం అందుకోక తప్పలేదని చెబుతారు. సూర్యప్రకాష్‌ రామచంద్రాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న వేణుగోపాల కృష్ణను తప్పించి సూర్యప్రకాష్‌కు సీటు ఇవ్వడం చర్చనియాంశంగా మారింది. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయీలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారునికి సీటు ఇవ్వాలని పిల్లి సుభాస్‌చంద్రబోష్‌ పట్టుపట్టడంతో సీఎం సూర్యప్రకాష్‌కు సీటు కేటాయించారు. ఆయన అరంగేట్రం నిరసనల మధ్య జరుగుతూ ఉంది. దీనిని సూర్యప్రకాశ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
తండ్రి బాటలో తనయుడు


మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఇప్పటికే రాజకీయ సభల్లో ప్రత్యక్షమవుతుూ ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అక్కడికి వెళ్లి వారిని పలకరించడం, కావాల్సిన సాయం ప్రభుత్వ పరంగా వచ్చేలా చేయడం చేస్తున్నారని టాక్. సుమారు నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాని కి ప్రతినిధిగా పనిచేస్తున్నారు. తండ్రి కంటే కుమారుడే ఎక్కువగా తిరుగుతున్నారని నియోజకవర్గం లో ప్రజలు చెబుతారు. దీనితో ఆయన కు పాజిటివ్ వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలను స్వయంగా తండ్రి తరఫున పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కోస్తా జిల్లాల వైఎస్సార్‌సీపీ జోనల్‌ యువజన విభాగం ఇన్‌చార్జ్‌గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వారసులుందరికి ఈ ఎన్నికలు కీలకం. 2024 పరీక్ష కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. పాస్ అయితే, అన్నీ మంచి రోజులే...
Next Story