జగన్ ఓటు బ్యాంక్ పదిలమా, శిథిలమా!
x
వైసీపీ విడుదల చేసిన జగన్ పోస్టర్

జగన్ ఓటు బ్యాంక్ పదిలమా, శిథిలమా!

జగన్‌. ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు వేసిన స్కెచ్‌ వర్క్‌అవుట్‌ అవుతుందా? లేదా? తన ఓటు బ్యాంక్ పదిలంగా ఉంటుందా లేదా..


రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం. పార్టీలకు ఎత్తుగడలే ప్రాణం. అధికార పార్టీ విపక్షాన్ని బోల్తా కొట్టించాలని, విపక్షం అధికార పక్షంపై పైచేయి సాధించాలని చూస్తాయి. ఈ సిగపట్లలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమిని బోల్తా కొట్టించి పై చేయి సాధించిందా? ఇప్పుడు ఏపీలో అదే జరిగినట్టు కనిపిస్తోంది. ‘వచ్చే 30 ఏళ్లు నేనే సీఎం’ అంటూ గతంలో ప్రకటించుకున్న జగన్‌... వచ్చే ఎన్నికలకు అంతే పకడ్బందీగా రెడీ అవుతున్నారు. ఎడాపెడా మార్పులు.. ఆపరేషన్‌ ఆకర్ష్‌.. సోషల్‌ ఇంజనీరింగ్‌.. ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో కొత్త పంథా... ఇలా సకల అస్త్రశస్త్రాలతో సీఎం జగన్‌ సిద్ధమవుతూ విపక్షం వీటి చుట్టూతూ తిరిగేలా చూస్తూ ఆయన తన పని తాను కానిచ్చుకుంటున్నారు.

బీసీలను దగ్గర చేర్చుకునే వ్యూహమా?

అసెంబ్లీ ఇన్‌చార్జులను ఎడాపెడా మార్చేసినప్పుడు విపక్షం.. జగన్ సెల్ఫ్‌ గోల్‌ వేసుకుంటున్నారంటూ రాద్ధాంతం చేశాయి. అభ్యర్థుల మార్పు వెనుక పకడ్బందీ వ్యూహం.. సామాజిక సమీకరణాలతో చేస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌తో బలమైన ఓటుబ్యాంకును పోగు చేసుకుంటున్నారన్న విషయాన్ని మరచిపోయాయి. ‘టీడీపీకి బలం బీసీలు. అదే బీసీలను 2019 ఎన్నికల్లో దూరం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. 2024లోనూ బీసీలను తన వైపు తిప్పుకునేందుకు జగన్ భారీ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు 70 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన సీఎం... ఎక్కువగా బీసీలు.. అదీ బీసీల్లోనూ బాగా వెనుకబడిన వర్గాలను దరిచేర్చుకున్నారు’ అంటారు సీనియర్ జర్నలిస్టు జి.రంగారావు. బలమైన ఓటుబ్యాంకు కలిగిన కులాలను ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శెట్టిబలిజ, యాదవ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్లాన్‌ చేస్తున్నారు సీఎం జగన్‌.

వంద రోజుల ముందే ప్లాన్‌...

రాజకీయాల్లో వ్యూహమే ముఖ్యం. పకడ్బందీ వ్యూహరచనతోనే విజయం దక్కుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం. సీఎం జగన్‌ కూడా ఈ వ్యూహరచనలోనే తన మార్కు చూపిస్తున్నారు. ఎన్నికలకు వంద రోజుల ముందే క్యాడర్‌ను సిద్ధం చేయాలని సంకల్పించారు. అందుకు తగ్గట్టే డిసెంబర్‌ నుంచే నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను మార్చడం మొదలుపెట్టారు. ఒకేసారి మార్పులు చేయకుండా వారం పది రోజుల గ్యాప్‌లో పది-పదిహేను స్థానాలకు సమన్వయకర్తలను మార్చడం ద్వారా.. ఎక్కడైనా అసంతృప్తులు, అసమ్మతులు ఉంటే అదుపు చేయొచ్చని భావించారు.

ఏడు విడతల్లో జాబితా...

సీఎం జగన్‌ ఊహించినట్టుగానే ఏడు విడతల్లో జాబితా విడుదల చేయగా, కొద్దిమంది అసంతృప్తి గళమెత్తారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ లైన్‌ దాటలేదు. అలా పార్టీని వదిలి వెళ్లిన వారు కూడా మళ్లీ యూటర్న్‌ తీసుకుని పార్టీలోకి వస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇందుకు ఉదాహరణ. డిసెంబర్‌లో మొదటి జాబితా విడుదల చేయడానికి ఒక్కరోజు ముందు వైసీపీని వీడిన ఆర్కే.. రెండు నెలలు తిరిగేసరికి సొంతగూటికి చేరుకోవడం జగన్‌ మార్కు వ్యూహం. రాజకీయాల్లో 30-40 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా జగన్‌ ఎత్తుగడలను పసిగట్టలేనకపోతున్నారంటే అతిశయొక్తి కాదు.

చాలా మంది తిరిగి వస్తారా?

పార్టీపై రుసరుసలాడి బయటికి వెళ్లిన వారిని తిరిగి సొంతగూటికి రప్పించడంతో పాటు మరోపక్క ప్రత్యర్థి పార్టీ వాళ్లను తనవైపు తిప్పుకోవడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. వెళ్లిపోయిన ఆళ్ల మళ్లీ రాగా టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి కుటుంబానికి చెందిన రాయపాటి రంగారావు వంటివారిని పార్టీలోకి తీసుకోచ్చి వైసీపీ జెండాలు కప్పించారు. సొంతపార్టీలో అసంతృప్తిని చల్లార్చేలా ఏ సామాజికవర్గానికి ఆ సామాజిక వర్గం నేతల్ని ముందుంచి మాట్లాడించి నోరు మెదపనీయకుండా చేశారు. రాజధాని ఉద్యమంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్‌ జరిగిందనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి.... ఆ ప్రాంతానికి చెందిన బలమైన నేతలను వైసీపీలోకి ఆకర్షించడమే ఇందుకు నిదర్శనం.

విపక్షాలకు అర్థం కాని వ్యూహం...


జగన్‌ ఆలోచనలను ముందు పసిగట్టని ప్రతిపక్షాలకు ఆలస్యంగా తత్వం బోధపడింది. అభ్యర్థుల మార్పు ద్వారా వైసీపీ నుంచి 40-50 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేశారు. ఇలా ఎమ్మెల్యేలు వస్తే రాజ్యసభ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా... వైసీపీ అసంతృప్తులతో ఓ స్థానం గెలవొచ్చని ప్రణాళిక వేశారు. కానీ, జగన్‌ ప్రతిపక్షాల ఆలోచనపై ఆదిలోనే దెబ్బకొట్టారు. మార్పుల్లో సీట్లు దక్కని ఏ ఒక్కరూ పార్టీ లైన్‌ దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. ఒకరిద్దరు వెళ్లినా వారితో ఎలాంటి ప్రభావం చూపలేమని భావించిన టీడీపీ.. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించాయి. ఇదంతా పరిశీలిస్తే సీఎం జగన్‌ ముందస్తు వ్యూహంతోనే మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ.. ఇంకా చెప్పాలంటే 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో తొలిసారి ప్రాతినిధ్యం లేకుండా చేసింది. 'విపక్షాన్ని ఏమార్చి సక్సెస్‌ఫుల్‌గా దారిమళ్లించడంలో జగన్‌ ముందున్నారు. జగన్‌ వ్యూహమేమిటో తెలిసే లోగా తన పని తాను కానిచ్చుకున్నారు' అంటున్నారు ఉపాధ్యాయ సంఘం ఏపీ నాయకుడు బాల శౌరయ్య. మొత్తానికి చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తున్నజగన్‌.. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్‌ స్కెచ్‌ వర్క్‌అవుట్‌ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.



Read More
Next Story