టీడీపీకి బీజేపీ తోక పార్టీనా? సోము వీర్రాజుకు సీటు ఎందుకివ్వరు?
x

టీడీపీకి బీజేపీ తోక పార్టీనా? సోము వీర్రాజుకు సీటు ఎందుకివ్వరు?

టీడీపీతో పొత్తులో భాగంగా సీట్లు తీసుకునే వ్యవహారంలో బీజేపీ సరైన పద్దతిలో వ్యవహరించలేదని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..


తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా పది అసెంబ్లీ సీట్లు తీసుకున్న బీజేపీ సరైన అభ్యర్దులను పెట్టలేక ఆపసోపాలు పడుతోంది. దీనంతటికీ కారణం సీట్ల ఎంపికలో జరిగిన లోపాలే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీకి పట్టున్న సీట్లు, గట్టి అభ్యర్ధులు ఉన్న సీట్లను వదిలేసి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు వారిచ్చిన సీట్లను తీసుకోవడమే ఈ దుస్థితికి కారణమని సాటి బీజేపీ నేతలే విమర్శిస్తున్నారు.

బీజేపీ తీసుకున్న పది సీట్లలో రెంటిండిని తెలుగుదేశం పార్టీ అభ్యర్దులతో నింపేయడం బీజేపీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. బలం లేకపోయినా కడప జిల్లా బద్వేలు సీటును తీసుకున్న బీజేపీ అక్కడ సరైన అభ్యర్థి లేక తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి రోషన్నను రాత్రికి రాత్రి బీజేపీకిలోకి తీసుకువచ్చి టికెట్ ఇచ్చింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది.

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమల్లి రామకృష్ణా రెడ్డి రానంటే బతిమాలి పార్టీ మార్చి ఆయనకే టికెట్ కట్టబెడుతున్నారు. బీజేపీ తన అభ్యర్థిగా ఎం శివ కృష్ణం రాజును ఎంపిక చేసింది. అయితే రామకృష్ణారెడ్డి వర్గీయుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, రాజమండ్రి ఎంపీ సీటు నుంచి పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీలో వుండడంతో దానిని మార్చారు.

ఐవైఆర్ అభ్యంతరం

పొత్తు , సీట్ల ఎంపిక, అభ్యర్దుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయని ఆ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏపీలో బీజేపీ మనుగడే ప్రశ్నార్దకమౌతుందన్న అందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఏపీలో బీజేపీ దిశ దశ లేకుండా సాగుతోందనడానికి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపికను ఇంకొక ఉదాహరణగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలనపై ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, అక్కడే బీజేపీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

సీట్ల పంపకాల్లో మాత్రం టీడీపీ ఇచ్చినవే బీజేపి తీసుకున్నది. వాటిలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నియోజకవర్గాలేనని ఐవైఆర్ కృష్ణారావు గుర్తు చేశారు. ఆ తీసుకున్న మూడు నాలుగు పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమం.. ముస్లిం మెజారిటీ ప్రాంతం అని గుర్తు చేశారు. ఏ ప్రాతిపదికన ఈ సీట్లను తెలుగుదేశం పార్టీ బీజేపికి ఇచ్చింది. వాటిని బీజేపీ తీసుకుందో అర్థం కావట్లేదని ఐవైఆర్ అన్నారు. కొంతమంది అభ్యర్థులను ముందే బీజేపీ నిర్ణయించి ఉంటే వాళ్లకు కలిసివచ్చే నియోజకవర్గాలను టీడీపీ వద్ద గట్టిగా అడిగి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

అలాకాకుండా టీడీపీ ఇచ్చిన నియోజకవర్గాల్లో తాము నిర్ణయించిన అభ్యర్థులను సర్దుబాటు చేసే ప్రయత్నానికి పాల్పడటం వల్లే ఈ తంటాలు వచ్చిపడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పార్టీలో చేర్చుకుని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం అనేది ఏపీలో బీజేపీ మనుగడనే ప్రశ్నించే చర్యగా ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవేళ కావాలనుకుంటే ఆ సీటును టీడీపీకి వదిలి రాజమండ్రి అర్బన్ తీసుకొని సోము వీర్రాజుతో పొటీ చేయించి ఉండొచ్చని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ అలా చేయలేదని అన్నారు. టీడీపికి ఇబ్బంది పడకుండా బీజేపీ రాజకీయాలు సాగాలనుకోవడం సరికాదన్నారు ఐవైఆర్.

Read More
Next Story