నల్లమల.. చిరుతలు ఇలా వస్తే ఎలా?
x

నల్లమల.. చిరుతలు ఇలా వస్తే ఎలా?

ఊళ్ల మీదికి వస్తున్న చిరుతలు, పులులు.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు


దట్టమైన నల్లమల అడవుల్లో తిరగాల్సిన పులులు, చిరుతలు ఊళ్ల మీద పడుతున్నాయి. జనావాసాలను బెంబేలెత్తిస్తున్నాయి. వన్యప్రాణులు తరచూ గ్రామాల శివార్లలో కనిపించడంతో రైతులు, పశువుల కాపర్లు వణికిపోతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లడానికీ, పశువుల్ని అడవిలో మేపుకు తీసుకువెళ్లడానికి జంకుతున్నారు.

నల్లమలలో కొంతకాలంగా వర్షపాతం తగ్గింది. ఫలితంగా కుంటలు, చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో జింకలు, కణుతులు, ఇతరత్రా జీవాలు మైదాన ప్రాంతానికి తరలిపోతున్నాయి. వాటిని వేటాడేందుకు పులులు, చిరుతలు కూడా మైదాన ప్రాంతాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆహార వేటలో భాగంగా పులులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పులుల గణనలో నల్లమలలో 85 వరకు పెద్దపులులు, వందల్లో చిరుతలు ఉన్నట్లు తేలింది.

ప్రకాశం జిల్లా కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో సుమారు 48,500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 7 సెక్షన్‌లు, 16 బీట్‌లు ఉన్నాయి. ప్రధానంగా భైరవకోన, వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్‌ల పరిధిలోని కొండ కింద శివారు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోంది. వారం రోజుల క్రితం మరపగుంట్లలో పులి సంచరిస్తున్నట్లు ప్రచా­రం జరిగింది. ఫారెస్ట్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు సేకరించి 3, 4 ఇంచుల పొడవు ఉన్నట్లు తెలిపారు. పాద ముద్రలను బట్టి అది పెద్దపులి కాదని నిర్ధారించారు. పెద్దపులి పాద ముద్రలు 7, 8 ఇంచుల పొడవు ఉంటాయన్నారు.
గత శనివారం రాత్రి ఇమ్మడిచెరువు–రాళ్లపల్లి మధ్య పొలాల్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఒక పులిని చూసినట్లు చెప్పాడు. వెంటనే అధికారులు ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తుంగోడు, పిల్లిపల్లి వంటి బీట్‌లలో ట్రాప్ కెమెరాల్లో చిరుత పులులు సంచరించినట్టు రికార్డు అయిందని అటవీశాఖ వెల్లడించింది.
బిక్కుబిక్కుమంటున్న రైతులు...
యర్రగొండపాలెం రేంజి పరిధిలోని కొలుకుల బీట్‌లో పెద్దపులి కనబడటంతో రైతులు భయంలో వణికిపోతున్నారు. గత ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులకు పెద్దపులి కనిపించింది. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులతో పాటు రైతు కూలీలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. కొలుకుల బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దదోర్నాల మండల పరిదిలోని పెద్ద»ొమ్మలాపురం రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటంతో తరచూ వన్యప్రాణులతో సమస్యలు ఎదురవుతున్నాయి.

పెద్దపులి సంచారం ఉన్న దేవలూడు ప్రాంతంలో గతంలోనే అటవీశాఖ బేస్‌ క్యాంపును ఏర్పాటు చేసింది. పులులకు ఆహారం దొరక్క పశువుల మందలు ఉన్న పెద్దదోర్నాల మండలం గండిచెరువు సమీప ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉందని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేవలూడు ప్రాంతంలో నీటి నిల్వలు అధికంగా ఉండటం కూడా పులు­­ల సంచారానికి మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు.
గతంలో పాలుట్లలో తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న రైతు బాలునాయక్‌పై పెద్దపులి దాడి చేసి గాయపర్చగా, బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు ఎద్దును సైతం పులి హతమార్చింది. గ్రామానికి చెందిన దేవలూడు, గండి చెరువు ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యవసాయ భూములు ఉండటంతో బొమ్మలాపురం వాసులు ఆందోళ­న చెందుతున్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలోనూ..
అర్థవీడు మండలంలోని కొ­త్తూరు, దొనకొండ, వెలగలపాయ, బొల్లుపల్లి, అచ్చంపేట, మాగుటూరు, మోహిద్దీన్‌పురం గ్రామాల పరిధి­లో తరచూ పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెలగలపాయ, దొనకొండ, మాగుటూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. మొహిద్దీన్‌పురం వద్ద కారులో వెళ్తున్న కొందరికి పులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

కంభం మండలంలోని దర్గా కొండ సమీపంలో నెల రోజుల క్రితం పులి అడుగులు కనిపించడంతో ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని సూరేపల్లి సమీపంలో కొండవద్ద పులి అడుగులు ఉన్నాయని స్థానికులు చెప్పగా ఫారెస్టు అధికారులు ట్రాప్‌ కెమెరాలు బిగించి పరిశీలించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో నీటివనరులు ఏర్పాటు చేయాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
యర్రగొండపాలెం రేంజ్‌లోని కొలుకుల బీట్‌లో పెద్దపులి కనిపించడంతో రైతులు మరింత భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులు “మేము రాత్రివేళ పొలాలకు వెళ్లడానికే భయపడుతున్నాం” అని చెబుతున్నారు.

పులుల సంచారంపై అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోంది. పులుల పాదముద్రలు సేకరించే ట్రాప్ కెమెరాలు అమర్చుతున్నారు. “మన పరిధిలో పెద్ద పులులు లేవు. కానీ చిరుతలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామస్తులు రాత్రిళ్లు బహిరంగ ప్రదేశాల్లో నిద్రించవద్దు, ఒంటరిగా అడవిలోకి వెళ్ళవద్దు. పశువులను గ్రామ శివార్లకే పరిమితం చేయండి” అని కనిగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి సూచించారు.
అనూహ్యంగా పెరిగిన వన్యప్రాణులతో పాటు వర్షాభావం, ఆహార కొరత వంటి కారణాలతో పులులు, చిరుతలు గ్రామాల వైపు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఉన్నా, పులి ఎప్పుడు ఎదురుపడుతుందోనన్న భయంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Read More
Next Story