ఏపీ టీమ్‌కి తిరిగిరండి: హనుమ విహారికి లోకేష్ ఆహ్వానం
x

ఏపీ టీమ్‌కి తిరిగిరండి: హనుమ విహారికి లోకేష్ ఆహ్వానం

మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి స్వాగతం పలుకుతున్నది.


హనుమ విహారీ.. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా, టీమిండియా ప్లేయర్‌గా రాణించిన ఆటగాడు. కానీ క్రీడారంగంలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ఆటకే దూరమయ్యాడు. గతంలో హనుమ విహారీ, వైసీపీ ప్రభుత్వం మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఏదో ఒక ప్లేయర్ విషయంలో ఈ వివాదం రాజుకుంది. హనుమ విహారీపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఈ విషయంలో వైసీపీ తీరును టీడీపీ, జనసేన పార్టీ అధినేతలతో పాటు, ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. వైసీపీ చిత్తశుద్దితో పనిచేయాలని, తమ స్వార్థం కోసం ఒక మంచి ఆటగాడిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాటపైన నిలబడిన టీడీపీ

రాజకీయ ఒత్తిడితో ఇసుగెత్తిన విహారీ తాను ఇక జీవితంలో మళ్ళీ ఆంధ్రటీమ్ కెప్టెన్‌గా మైదానంలో అడుగు పెట్టనని శపథం చేసి మరీ తప్పుకున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హనుమ విహారీని తిరిగి క్రికెట్ ఆడాలని ప్రభుత్వం కోరింది. ఆయనకు విశేష గౌరవం అందిస్తూ జట్టుకు తిరిగి రావాలని కోరారు. ఈమేరకు నారా లోకేష్.. హనుమ విహారీని కలిసి పుష్పగుచ్చంతో స్వాగతించారు. దీనిపై విహారీ తన స్పందన ఏమీ చెప్పలేదు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

‘అందుకే అవమానించింది’

‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన పి.శరత్ చంద్రారెడ్డిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించుకోవడంతో గత ప్రభుత్వం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో ‘రాజకీయ క్రీడ’ మొదలుపెట్టింది. తమ పార్టీ నాయకుడి కుమారుడు, జట్టులో 17వ ఆటగాడు అయిన కుంట్రపాకం పృథ్వీరాజ్‌ను ప్రోత్సహించేందుకు అసమాన ప్రతిభాపాటవాలు ఉన్న హనుమ విహారి లాంటి క్రికెటర్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధించింది, అవమానించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, నేను స్పందించి, హనుమ విహారికి అండగా ఉన్నాం. #WeStandWithHanuma పేరుతో సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది కూడా. క్రికెట్ అభిమానులు ఎందరో హనుమ విహారికి సంఘీభావం తెలిపారు’’ అని ఆనాడు జరిగిన విషయాలను గుర్తు చేశారు లోకేష్.

నేర్పడానికి అడ్డుపడింది

‘‘హనుమ విహారి తన క్రికెట్ అనుభవాన్ని ఇతరులకు నేర్పేందుకు కూడా ఆనాటి వ్యవస్థ అడ్డుపడింది. దేశంలోని ఇతర రాష్ట్రాల క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించేలా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభంజనం చూసిన తర్వాతే హనుమ విహారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అన్ని ఆటల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. క్రికెటర్ హనుమ విహారికి పూర్తి న్యాయం చేసేందుకు మాట ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

Read More
Next Story