
Monolithic city | ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ
టీటీడీ అధికారులు ఆదివారం ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఏప్రిల్ లో శ్రీకోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.
కడప జిల్లా ఒంటమిట్ట శ్రీకోదండరామాలయంలో ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిచారు. అనంతరం ఆలయంలోని కోదండరామస్వామివారి మూలమూర్తి దర్శనం కల్పించారు. అంతకుముందు ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు దంపతులు, జెఈవో వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.
హోమ పూజలు
ఒంటమిట్ట శ్రీకోదండరామాలయంలో మహా సంప్రోక్షణకు ముందు ఉదయం నుంచి వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచసూక్త - పవమాన హోమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుంచి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ మహా కుంభాభిషేకం చేశారు. స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, గోవిందరాజన్, సెల్వం, ప్రశాంతి, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహర్, వీజీవో సదాలక్ష్మి, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు.
ఏప్రిల్ 6న బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఆరో తేదీ శ్రీరామనవమి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాల నిర్వణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ చేర్మన్ బీఆర్. నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతరం టీటీడీ తిరుపతి జేఈఓ వి. వీరబ్రంహ్మంతో కలిసి ఆలయ పరిసరాలు పరిశీలించడంతో పాటు చేయాల్సిన కార్యక్రమాలపై టీటీడీ చైర్మన్ నాయుడు సూచనలు చేశారు. అంతకుముందు ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలనుటిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు ఆవిష్కరించారు.
శ్రీరామనవమి
కడప జిల్లా అధికారులు, పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాట్లాడారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి - పోతన జయంతి నిర్వహిస్తామన్నరు. ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం
10న గరుడవాహనం
11న శ్రీసీతారాముల కల్యాణం
ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అశేషంగా హాజరయ్యే యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ముందస్తుగానే సమీక్షించడం ద్వారా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఏకశిలానగరం ఆలయ చరిత్ర
కడప నుంచి తిరుపతికి వెళ్ల జాతీయ రహదారిపక్కనే శ్రీకోదండరామాలయం ఉంది. పురావస్తు శాఖ ఆధీనంలోని ఈ ఆలయాన్ని కూడా టీటీడీ దత్తత తీసుకుంది.
పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.
శాసనాల ప్రకారం
ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు.
ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు. అనేది చారిత్రక ఆధార కథనం.
Next Story