జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.


జనసేనలో సభ్యత్వం తీసుకునేందుకు మరో వారం గడువు పెంచుతున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ల నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులతో టెలీకాన్‌ఫెరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లోను, తెలంగాణ రాష్ట్రంలోను చురుగ్గా పార్టీ సభ్యత్వ నమోదు చురుగ్గా జరుగుతోంది. గత 10 రోజులుగా సభ్యత్వ కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహిస్తున్నారు. అయితే తీవ్ర వర్షాలు, కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు రావడం వల్ల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి కొని రోజులు పెంచాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు జనసైనికులు, నాయకులు, వాలంటీర్లు, వీర మహిళల నుంచి అభ్యర్థనలు అందాయి. దీంతో మరో వారం గడువు పెంచుతూ పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం తీసుకున్నట్లు నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నెల 28తో సభ్యత్వం నమోదు గడువు ముగిసింది. అయితే ఆగస్టు 5వరకు గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. గత సంవ్సరం పార్టీ సభ్యత్వ నమోదు మందగొండిగా సాగింది. కేవలం ఆరు లక్షల సభ్యత నమోదుతోనే ముగించారు. ప్రస్తుతం ఈ 10 రోజుల్లో ఇప్పటి వరకు 10లక్షల సభ్యత్వం నమోదైంది. మరో 10లక్షల సభ్యత్వ నమోదను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు మనోహర్‌ చెప్పారు. ఈ సందర్భంగా జనసేన ఐటీ టీమ్‌ను నాదెండ్ల మనోహర్‌ అభినందించారు.

ఇప్పటి వరకు 10లక్షల సభ్యత్వం నమోదైనందుకు జనసేన ఐటీ టీమ్‌ సభ్యులతో పాటు కష్టపడి అద్బుతంగా పని చేసిన వాలంటీర్లు, జనసైనికులు, వీర మహిళలకు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. క్రియాశీల సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రతి పైసా కార్యకర్తల సంక్షేమానికే వినియోగిస్తామన్నారు. ప్రతి నియోజక వర్గంలో 5వేలు సభ్యత్వం చేయాలని తొలుత టార్గెట్‌ పెట్టుకున్నామని, పది రోజుల కాలంలో 10లక్షల సభ్యత్వం నమోదు కావడం మంచి అచీవ్‌మెంటన్నారు. శాసన మండలి సభ్యులు పి హరిప్రసాద్‌ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరు అద్బుతంగా పని చేశారని గత ఏడాది నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు కొనసాగితే ఈ సంవత్సరం పది రోజుల పాటు మాత్రమే కొనసాగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే సభ్యత్వాలు రెట్టింపు అయ్యాయని, పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకమే ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వం నమోదు కావడానికి ప్రధాన కారణమన్నారు. పవన్‌ కళ్యాణ్‌ సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్ష చేశారని, ఆ సమీక్షలో వచ్చిన అభ్యర్థనల మేరకు నమోదు కార్యక్రమాన్ని మరో వారం పొడిగించినట్లు చెప్పారు.
Next Story