
బీజేపీ ఇదే చెప్పిందా మంత్రి సత్యకుమార్ గారు?
ఆంధ్రప్రదేశ్ లో పాలన గడితప్పిందా? చంద్రబాబు రాష్ట్ర మంత్రులపైన పట్టుకోల్పోయారా? మంత్రులు, వారి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో పాలన గడితప్పిందా? చంద్రబాబు రాష్ట్ర మంత్రులపైన పట్టుకోల్పోయారా? మంత్రులు, వారి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన తీరు చూస్తుంటే పాలన గాడితప్పిందనేది స్పష్టమవుతుంది.
ఆమధ్య ఓ మంత్రి మద్యం షాపుల వ్యవహారంలో చిక్కుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చీవాట్లు తిన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇటీవల ఓ మంత్రి ఇసుక రీచ్ లలో జోక్యం చేసుకుని నగుబాట్ల పాలయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇంకోమంత్రి అనుచరుడు ప్రముఖ కార్ల పరిశ్రమ కియా కంపెనీ భూములకే ఎసరు పెట్టి రౌడీయిజానికి తెగబడ్డారు. అయితే ఈ మంత్రి టీడీపీకి చెందిన వారు కాకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక చంద్రబాబు సతమతం అవుతున్నారట. కియా కంపెనీని తెచ్చిందే తానని చెప్పుకునే చంద్రబాబుకు ఈ మంత్రి అనుచరుడు చేసిన చేష్టలకు కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారట.
జరిగిందేమిటంటే...
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో కియా పరిశ్రమ ఉంది. దీనికి సమీపంలో భూమి ఇప్పుడు కోట్లు పలుకుతోంది. ఇందులో కొంత విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీయిజానికి తెగబడ్డారు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. అడ్డువచ్చిన భూ యజమానిపై దాడికి పాల్పడ్డారు.
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునిమడుగు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 433లో 1.72 ఎకరాల భూమిని చండీగఢ్కు చెందిన హరిజిత్సింగ్ నుంచి 2018లో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ కొనుగోలు చేశారు. ఈ భూమికి ఆనుకొని ముదిగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములున్నాయి.
వైసీపీ నుంచి ఎంపీపీగా ఎంపికైన ఆయన ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి మంత్రి సత్యకుమార్కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొందరు ప్రభాకర్కు చెందిన భూమి వద్దకు చేరుకుని బీభత్సం సృష్టించారు.
ప్రభాకర్ను బంధించి ఆదినారాయణతో మాట్లాడించారు. ‘‘ఏరా, భూమిలో పని చేయొద్దని చెప్పినా వినవా.. చెప్పినట్లు వినకపోతే చంపేస్తా’’ అంటూ ఫోన్లో బెదిరించారు. అనుచరులను ఉద్దేశించి ‘‘రేయ్ మనకు కావాల్సిన వ్యక్తి వీడే.. చంపేయండి’’ అంటూ ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన అనుచరులు ప్రభాకర్పై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. సమీప పొలాల్లోని రైతులు గమనించి కేకలు వేయడంతో ప్రభాకర్ను విడిచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు కియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పొక్లెయిన్, కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
రాజకీయ పలుకుబడి ఉండడంతో ఈ కేసు ఏమవుతుందో అందరికీ తెలిసిందే.
వామపక్షాల ఖండన..
ఈ పరిణామాల పట్ల వామపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. విలువలు, రాజకీయనైతికత గురించి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే సత్య కుమార్ ఇప్పుడేమంటారని సీపీఐ నాయకుడు రామకృష్ణ ప్రశ్నించారు. ఇతరుల భూముల్ని ఆక్రమించుకునేందుకు వీళ్లకు ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story