మంగళగిరి వాసులకు నారా లోకేష్ కీలక హామీ
x

మంగళగిరి వాసులకు నారా లోకేష్ కీలక హామీ

లోకేష్ మాట్లాడుతూ... మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనని అన్నారు.


పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనని అన్నారు. మంగళగిరి చేనేతకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలూ చేపడతానని చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలెట్ ప్రాజెక్టుగా వీవర్స్ శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. చేనేత లో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం, త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అని లోకేష్ అన్నారు. దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తయారుచేస్తామని హామీ ఇచ్చారు.

మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామని అన్నారు, దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటు కు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయి. తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు. మూడు నెలలు రాజకీయాల కోసం పోరాడాం, ఇప్పుడు 4 ఏళ్ల 9 నెలలు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేద్దాం అని లోకేష్ పిలుపు ఇచ్చారు.

మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కల్యాణ మండపం నిర్మించారని, సంఘం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చెయ్యాలని, మంగళగిరి చరిత్ర తెలుసుకోవడంతో పాటు చరిత్ర ను కాపాడటం కోసం యువత అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్య్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు ఆలయ అభివృద్ధి, చేనేత, స్వర్ణకారుల సంక్షేమం కోసం మంత్రి లోకేష్ కు పలు సూచనలు చేశారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతు రావు మాట్లాడుతూ... జీఎస్టీ పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం, ఒకవేళ కేంద్రం ఒప్పుకోక పోతే జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం పట్ల ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పెద్దలందరితో చర్చించిన తరువాత అన్ని కార్యక్రమాలు చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతురావు, పంచుమర్తి అనురాధ, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

Read More
Next Story