వైసీపీ పాలనలో వైభోగం..
2019 నుంచి 2024 వరకు సాగిన వైసీపీ పాలనలో స్వరూపానందేంద్ర సరస్వతి వైభోగమే జరిగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్తో నేరుగా ఆయనకు సాన్నిహిత్యం ఉండడంతో వైసీపీ మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు ఎందరో తమ స్థాయిని మరిచి స్వామీజీ ప్రాపకం కోసం ప్రాకులాడేవారు. జగన్కు ఈ స్వామీజీ ఎంత చెబితే అంతే! అనే ప్రచారం ఉండేది. ఇలా నిత్యం జనంకంటే రాజకీయ నేతలు, అధికారులతోనూ క్షణం తీరిక లేకుండా స్వామీజీ గడిపేవారు. ఆయనకు 2+2 సెక్యూరిటీతో భద్రత కల్పించారు. శారదా పీఠం వద్ద ఒక ఔట్ పోస్టును కూడా ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించేవారు. ఇక స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శారదా పీఠం నుంచి విశాఖ విమానాశ్రయం వరకు ఏకంగా అత్యంత అరుదైన గ్రీన్ ఛానల్నే ఏర్పాటు చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ జగన్ దిగిపోయాక..
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక స్వరూపానందేంద్ర సరస్వతికి గడ్డు కాలం దాపురించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖ శారదా పీఠానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరం రూ.కోట్ల విలువ చేసే ఆ భూమిని కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకే కట్టబెట్టారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపి ఆ కేటాయింపులను రద్దు చేసింది. అలాగే గతంలో తిరుమలలో శారదా పీఠం మఠానికి కేటాయించిన స్థలానికి ఆనుకుని ఉన్న జాగాను ఆక్రమించి అక్కడ కూడా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టడంతో పెనాల్టీ సొమ్ము చెల్లించి క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం అనుమతించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై టీటీడీ హైకోర్టునాశ్రయించింది. దీనిపై తాజాగా ఆక్రమిత భవనాన్ని టీటీడీకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 15 రోజుల్లో ఆ భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలంటూ టీటీడీ శారదా పీఠానికి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు విశాఖ చినముషిడివాడలో ఉన్న శారదా పీఠంలోనూ ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టడాలు నిర్మించారంటూ ఫిర్యాదులున్నాయి. దీనిపై పీఠం కోర్టునాశ్రయించింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక స్వరూపానందేంద్ర సరస్వతికి, శారదా పీఠానికి చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి.
ఉత్తరాదిలోనే ఎక్కువ సమయం..
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పతనంతో స్వరూపానందకు అన్నీ ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలకుడని, ఆయన, పవన్ కల్యాణ్లు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వారికి తన ఆశీస్సులుంటాయని మీడియా సమావేశం పెట్టి మరీ స్వరూపానంద ప్రకటించారు. ఆ తర్వాత చాతుర్మాస దీక్ష కోసమని ఉత్తరాదికి వెళ్లిపోయారు. అప్పట్నుంచి శారదా పీఠానికి అత్యంత అరుదుగా వస్తున్నారు. ఎక్కువ సమయం ఉత్తరాదిలోనే గడుపుతున్నారు. చిన్న స్వామీగా పిలువబడే ఉత్తరాధికారి స్వాత్మానంద పీఠం వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఏటా తన పుట్టిన రోజును ఎప్పుడూ శారదా పీఠంలో అట్టహాసంగా జరుపుకునే స్వరూపానంద.. ఈసారి కాశీలో జరుపుకున్నారు. వైసీపీ హయాంలో ఆయన విశాఖ వచ్చినా, ఎక్కడికైనా వెళ్లినా చాలా హడావుడే కనిపించేది. కానీ ఇప్పుడు ఆయన ఎప్పడు వస్తున్నారో, ఎవరికీ తెలియడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆయన పరిస్థితిని చూసి గతంలో ఆయన దర్శనం కోసం పడిగాపులు పడిన మహామహులెవరూ ఇప్పుడు పీఠం ఛాయలకు వెళ్లడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యం వీవీఐపీల రాకపోకలతో పోలీసు వాహనాల కుయ్.. కుయ్ సైరన్లు వినిపించడం లేదు. ప్రస్తుతం ఈ స్వామీజీ పరిస్థితిని, నాడు ఆయన హవాను చూసిన వారు ఔరా! ఏమి? కాల మహిమ! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. స్వామీజీలుగా చెప్పుకునే వారు రాజకీయాలకతీతంగా ఉండాలే తప్ప ఒక పార్టీకి చెందిన స్వామీజీగా ముద్ర వేయించుకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని చర్చించుకుంటున్నారు.
చంద్రబాబుకు ఆయనకు విభేదాలేమిటి?
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్వరూపానందేంద్ర సరస్వతికి విభేదాలేమిటన్న దానిపై తలోరకంగా చెప్పుకుంటున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి అభిప్రాయ భేదాలున్నాయని చెబుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జయేంద్ర సరస్వతినే తప్ప స్వరూపానందను గుర్తించలేదని, అందువల్ల స్వరూపానందపై చంద్రబాబుకు సానుకూలత లేదని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా పొలిటికల్ స్వామి అయినంతగా మరెవరూ లేరు.
కాంగ్రెస్కు చంద్రస్వామిలా.. వైసీపీకి స్వరూపానందః బొలిశెట్టి
కాంగ్రెస్కు వివాదాస్పద తాంత్రిక చంద్రస్వామి ఎలాగో.. వైసీపీకి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి అలాగే. శారదా పీఠం రికగ్నైజ్డ్ పీఠం కాదు. దీనిని ఏ ధార్మిక పీఠమూ గుర్తించలేదు. హిందూ మత పెద్దలు ఎవరూ ఈయనను సమావేశాలకు ఆహ్వానించరు.