ఎన్టీఆర్ చైతన్య రథం..   ఓ రాజకీయ ప్రభంజనం...
x
చైతన్య రథం మీద ఎన్టీ రామారావు

ఎన్టీఆర్ చైతన్య రథం.. ఓ రాజకీయ ప్రభంజనం...

ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలయింది. తెలుగు నాట బస్సు యాత్ర అంటే గుర్తొచ్చేది ఎన్టీయార్ చైతన్యరథ యాత్రమే. ఆ రథయాత్ర ఏమిటి?


(ఎస్.ఎస్.వి. భాస్కర్)

తిరుపతి: అది ఒక ప్రభంజనం.. జన సునామి.. రాజకీయ చరిత్ర గతిని మార్చిన రాజకీయ ఉత్తుంగ తరంగం. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని నిలువరించిన మహా ఘట్టం. ఎన్టీ రామారావు సాగించిన ‘చైతన్య రథం’ భారతదేశ రాజకీయ యవనికపై చెరగని సంతకం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతేకాదు.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావుకు దన్నుగా నిలిచిన పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ చైతన్య ప్రధానికి సారధిగా మారారు. తొమ్మిది నెలలపాటు చైతన్య రథంపై విస్తృతంగా సాగించిన పర్యటనతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జనసంద్రంతో సునామీ సృష్టించిన ఎన్టీ రామారావు సీఎం పీఠంపై కూర్చున్నారు. స్వాతంత్య్రం తర్వాత నుంచి అధికారంలో వేళ్ళూనుకున్న కాంగ్రెస్ పార్టీని మొదటిసారి ప్రతిపక్షంలోకి నెట్టిన చైతన్య రథం అది. 42 సంవత్సరాల కిందటి అపూర్వ ఘట్టాన్ని ఒకసారి తరచి చూద్దాం.


రాజకీయ చైతన్యానికి బీజం

1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనకు బీజం పడింది. సినిమాల్లో తన నటన ద్వారా అశేష అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రామారావు.. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. స్వాతంత్య్రం అనంతరం నుంచి రాష్ట్రంలో దేశంలో అధికరాన్ని అప్రతిహతంగా సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచే గడ్డు రోజులు ప్రారంభమయ్యాయి. "పదేపదే సీఎంలను మారుస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ఈ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిద్దాం" అనే నినాదంతో ఎన్టీ రామారావు ప్రజల్లోకి వెళ్లారు. అప్పటివరకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ వటవృక్షం కూలింది. 9 నెలల స్వల్ప వ్యవధిలో ప్రచారం సాగించిన ఎన్టీ రామారావు 22 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని మొదటిసారి ప్రతిపక్షంలోకి నెట్టేశారు. ఇందుకోసం అంతకంటే ముందు సాగించిన ప్రచార ఘట్టాన్ని పరిశీలిస్తే..

జీపుతో ఇబ్బంది..

ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత ఓ జీపులో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కోవలో కర్నూలు సమీపంలోని తుంగభద్రా గెస్ట్ హౌస్‌లో ఆయన బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఎన్‌టీ రామారావును చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. సాధారణంగా జనం కనిపిస్తే ఎన్టీఆర్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందనేది ఆయనను దగ్గరగా చూసిన పార్టీ పెద్దలు అభిమానులు చెబుతుంటారు. ఆ సమయంలో ప్రజలతో మాట్లాడడానికి జీపు సౌకర్యవంతంగా లేదు అని భావించిన ఆయన జీప్ టాప్ తీసివేయాలని పార్టీ నాయకులకు సూచించారు. రాష్ట్ర పర్యటనకు జీపు సరిపోదనే అభిప్రాయానికి వచ్చిన ఎన్టీ రామారావు మరో వాహనం ఉండాలని ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత..


రథం ఉండాలనే ప్రస్తావన

"ప్రచారం ముమ్మరం చేయాలి. ప్రజలకు మేము కనిపించేలా ఉండాలి. సూచనలు చేయండి బ్రదర్ .. " అని రామకృష్ణ సినీ స్టూడియోలో ఆ తర్వాత జరిగిన చర్చల్లో ఎన్టీ రామారావు సూచించారని చెబుతారు. దక్షిణాది రాష్ట్రాలకు కూడా చలనచిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగా ఉండేది. ఎన్టీ రామారావుకు ముందు నుంచి తమిళనాడు ఆరాధ్య దైవంగా భావించే ఎంజీ రామచంద్రన్ సినీ హీరో. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎంజీఆర్.. డిఎంకేతో విభేదించారు.

అన్నాడీఎంకే( ఏఐఏడీఎంకే)ను స్థాపించారు. తన అభిమాన శ్రేణులను నమ్ముకుని, ఎన్నికల ప్రచారానికి వాహనంలో వెళ్లారు. రెండుసార్లు ఆయన తమిళనాట విజయదుందుభి మోగించి, సీఎం పీఠాన్ని అధిరోహించారు. రెండు ఎన్నికలకు ఆయన అదే వాహనం వాడారు. 1977 నుంచి ఎంజీ రామచంద్రన్ ఓ వాహనాన్ని వాడకుండా ఇంటి వద్ద షెడ్డులో ఉంచారట. ఇదే విషయం ఇక్కడ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతున్న చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అంతే బ్రదర్స్.." అన్న గారికి చెప్పండి. మేము పంపామని.. తమ్ముడు వాహనం కావాలంటున్నాడు.. అని నా మాటగా చెప్పండి" అని అనుయాయులను పురమయించారట.

అపిడియా.. (అవునా..!)

ఎన్టీఆర్ సందేశాన్ని అందుకున్న ఎంజీ రామచంద్రన్ కూడా అత్యంత గౌరవంగా సానుకూలంగా స్పందించారట. తంబి అంద మాదిరి సోల్నాగ (తమ్ముడు ఆ మాయలు చెప్పి పంపాడా..!) సరి.. సరి... ఉల్లా ఇరకరాంగో.. పారుపోంగో (సరే సరే.. లోపల ఉంది వెళ్ళి చూడండి) అన్నారంట. అంటే వాహనం షెడ్డులో ఉంది వెళ్లి చూడండి అని సూచించారట. అక్కడున్న రెండు వాహనాల్లో ఒకటి మాత్రమే ఎంపిక చేసి, ఆ విషయాన్ని ఎన్టీ రామారావుకు సమాచారం అందించారట. అంతే ఓ పురాతన కాలం నాటి వాహనం బయటకు వచ్చింది. షెడ్డుకు తీసుకెళ్లి ఇంజన్ మినహా మిగతా మరమ్మతులు, ఏర్పాట్లు చేయించారు. ఇక అసలు కథ మొదలైంది.


ఏబీఆర్ 7776

ఈ నెంబర్ ఏంటి అనుకుంటున్నారా. దానికి ప్రత్యేక చరిత్ర ఉంది. తెలుగు నాట ఆరాధ్య దైవంగా భావించే ఎంజీ రామచంద్రన్ రెండు ఎన్నికల్లో విజయ బావుటా ఎగరవేయడానికి ఆ రాష్ట్రమంతా తిరిగిన వాహనం నెంబర్ ఇది. తమిళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎంజీ రామచంద్రన్ ఏబీఆర్ 7776 వాహనంలో తమిళనాడులో కలియతిరిగారు. విజయం సాధించారు. 1940 కాలంనాటి చెవర్లి కంపెనీకి చెందిన ఆ పురాతన వాహనం జీ24 రకానికి చెందింది. ఆ వాహనాన్ని ఎన్టీ రామారావు వాహనం కొనుగోలు చేశారు.

వాహనంలో ఏర్పాట్లు

ఎంజీఆర్ నుంచి కొనుగోలు చేసిన ఆ వాహనాల్లో కొన్ని మార్పులు చేశారు. రంగు, స్టిక్కరింగ్‌లతోపాటు, మైక్ సెట్, వాహనంపై నిలబడితే అందరికీ కనిపించే విధంగా వెలుగులు ఏర్పాటు చేయించారు. వాహనం లోపల కుర్చీ పొడవాటి సోఫా, మరో చిన్న సోఫా, పడుకోవడానికి మంచం. టాయిలెట్ వంటి సదుపాయాలు కల్పించారు. వాహనం నుంచి టాప్‌పైకి ఎక్కడానికి హాలు లాంటి గదిలో నుంచే నిచ్చెన కూడా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వాహనం తిరగడానికి కావలసిన అనుమతులు తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఈ లాంచనాలన్నీ పూర్తయ్యాయి. అంతే ఇక ఆ రథంతో జన సునామి వచ్చింది ఎలాగంటే.


హరికృష్ణ సారధిగా..

చైతన్య రథం అన్ని హంగులతో 1982 డిసెంబర్ 10వ తేదీన రోడ్డుపైకి వచ్చింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ ఈ చైతన్య రథానికి సారధిగా మారారు. బెల్ బాటం ప్యాంటు రెండు జేబులు ఉన్న ఖాకీ చొక్కా ధరించిన ఎన్టీ రామారావు.. వాహనంపైకి ఎక్కి చేయి ఊపడం ఆలస్యం ఈలలు, కేకలతో జై ఎన్టీఆర్ నినాదాలు. ఇక ఊపు ప్రారంభమైంది. కదిలిన చైతన్య రథానికి ఖాకీ చొక్కా ధరించిన నందమూరి హరికృష్ణ స్వయంగా వాహనం నడుపుతూ కదిలారు. అంతే దాదాపు 75 వేల కిలోమీటర్లకు పైగానే ఉమ్మడి రాష్ట్రమంతా చైతన్య రథం ఊరు ఊరున పర్యటించింది. ఆ రథం తిరగని పల్లె లేదు. చైతన్య రథం వస్తోంది అని తెలిస్తే చాలు. ప్రజలు రోడ్ల వెంబడి రోజులు తరబడి నిరీక్షించిన సందర్భాలు కోకొల్లలు.

అలుపు లేని యాత్ర...

అలుపు, విరామం లేకుండా సాగిన ఆ చైతన్య రథయాత్ర ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలో ఒక సంచలనమైంది. రాజకీయ చైతన్యానికి పునాది వేసింది. సామాన్యుడు సైతం రాజకీయాల గురించి మాట్లాడుకునే స్థాయికి ఎన్టీ రామారావు చేపట్టిన ప్రచార రథయాత్ర చైతన్యం నింపింది. "తెలుగు జనతకు వందనం.. తెలుగు యువతకు అభివందనం. తెలుగు మమతకు అభివాదం. తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు.. గుడిసెల్లో గూడాల్లో... అడవుల్లో మగ్గిపోతుంటే చూసి భరించలేక.. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని బతికించడానికి పుట్టిందే తెలుగుదేశం" అని ఎన్టీ రామారావు.. ప్రజల పట్ల తనకున్న మమకారాన్ని అజెండాగా మొదటి ప్రసంగంలోనే ప్రకటించి తన నిజాయితీని చాటుకున్నారంటారు.


తిరుపతి సెంటిమెంట్..

తిరుపతి గోవిందరాజస్వామి గుడికి సమీపంలోని కోనేరు వద్ద చైతన్య రథం నుంచి మొదటిసారి ఎన్టీ రామారావు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చైతన్య రథం నుంచి సాగించిన ఆయన మాటలు హావభావాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అది ఒక చరిత్ర. రాజకీయ సునామీని సృష్టించిన ఒక అధ్యాయం. అంతేకాదు ఆ తర్వాత నుంచి మిగతా పార్టీలు బస్సు యాత్రను సాగించడానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన చైతన్య రథం యాత్ర ప్రేరణగా నిలుస్తుంది. అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Read More
Next Story