
అయ్యో, లక్ష్మణా, నీ స్టూడెంట్ నే గర్భవతిని చేశావా!
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో అయ్యవార్ల ఆగడం, పోలీసులకు ఫిర్యాదు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యవార్లే అత్యాచారాలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? ఆచార్యుల నుంచి ఏమి నేర్చుకోవాలి? తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడదే జరిగింది. ఒక ప్రొఫెసర్ తప్పు చేస్తే మందలించాల్సిన మరో ప్రొఫెసర్ కూడా ఘోరీకాడ నక్కలాగా తనకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూడడం ఈ ఘటనలో విస్మయపరుస్తోంది. ఈ మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే...
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన ఓ బీఈడీ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ స్టూడెంట్ గర్భం దాల్చింది. ఆమె లబోదిబోమంటూ గురువును ఆశ్రయించింది. ఆయన నాకేమీ తెలియదు, నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ బెదిరించి ఆమెను తన సొంత రాష్ట్రమైన ఒడిశాకు పంపించినట్లు సమాచారం.
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వర్సిటీలో ఓ విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ కొంతకాలంగా లైంగికంగా వేధించారు. ఇది తెలిసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్రెడ్డి వీడియో తీసి ఆమెను లైంగికంగా వేధించేందుకు యత్నించారు. ఇది శృతి మించడంతో ఆమె సహచర విద్యార్థులు ఇన్ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఆయన తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రొఫెసర్ల సెల్ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు.
ఈ ఘటనపై బాధిత విద్యార్థిని పది రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన తాత్సారం వహించడంతో ఇన్ చార్జి వీసిని ఆశ్రయించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దాంతో లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణకుమార్ను ఈ నెల 1న సస్పెండ్ చేశారని, 2 నుంచి ఆయన విధులకు రావట్లేదని వర్సిటీ విద్యార్థుల కథనం. ఈయనపై విచారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని సైతం వర్సిటీ నియమించినట్లు తెలిసింది.
ప్రొఫెసర్లే ఈ తీరున వ్యవహరిస్తుంటే వీళ్లను నమ్మి క్లాసులకు పంపడం ఎలా అని తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ సంస్కృతిని నేర్పించాల్సిన విశ్వవిద్యాలయంలో ఇంతటి వికృత చేష్టలు ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారు.
Next Story

