వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నేడు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వంశీ పీఏతో సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కొంత మంది నిందితులుగా ఉన్నారు. టీడీపీ నేత కాసనేని రంగబాబు దాడి కేసులో మరి కొంత మంది నిందుతులు ఉన్నారు. ఈ కేసుల్లో పట్టుబడకుండా వీరు గత కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్నారు. కాపు కాసిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో వంశీ పీఏ రాజా కూడా ఉన్నారు. అయితే ఇంకా మరి కొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు వేటలో ఉన్నారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన వంశీ అనుచరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే తాజా అరెస్టులు ఏ కేసుకు సంబంధించి జరిగాయనేది స్పష్టత రావలసి ఉంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎప్పుడు అరెస్టు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. వంశీపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.