తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ విశిష్టతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. పూజలతో ప్రక్షాళన చేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపు. ఎప్పుడంటే?


రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నీ దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసన సభ్యులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పూజల్లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అపవిత్రం చేశారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు జగన్‌మోహన్‌రెడ్డి తన ట్వీటర్‌ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. సెప్టెంబరు 28, శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచ్చారు.

టీటీడీ ఈవో మాటలకు, మీ మాటలకు ఎందుకు తేడాలున్నాయని తన సామాజిక వేదికగా సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం జగన్‌ ప్రశ్నలు సంధించారు. తన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. జూలై 23న వెజిటబుల్‌ ఫాట్స్‌ మాత్రమే గుర్తించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. సెప్టెంబరు 18న ఎన్డీఏ రాజకీయ సమావేశంలోయానిమల్‌ ఫాట్స్‌ గుర్తించామని సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ అవును యానిమల్‌ ఫాట్స్‌ గుర్తించామని అన్నారు. దీని తర్వాత మళ్లీ టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఎన్‌డీడీబీ ల్యాబ్‌ ద్వారా నాణ్యతలేదని గుర్తించిన నాలుగు ట్యాంకర్లను వాడలేదని చెప్పారు. దీని తర్వాత సీఎం చంద్రబాబు మళ్లీ మాట్లాడుతూ రెండో, మూడో ట్యాంకర్లు ఆలయంలోకి వెళ్లాయాన్నారు. నారా లోకేష్‌ ట్వీట్‌ చేస్తూ నాణ్యతలేదని గుర్తించిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపామన్నారు. ఎందుకు ఇన్ని నాటకాలు అని నిలదీశారు. దేవుడి విషయంలో, వందల కోట్ల మంది భక్తుల మనోభావాల విషయంలో ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్‌ ప్రశ్నించారు.
Next Story