‘విశాఖ ఉక్కు’ రక్షణ ఉద్యమానికి తికాయత్ పిలుపు
x

‘విశాఖ ఉక్కు’ రక్షణ ఉద్యమానికి తికాయత్ పిలుపు

విశాఖ ఉక్కు ను ప్రయివేటీకరణను అడ్డుకోవాలని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రైతాంగ ఉద్యమకారుడు రాకేష్ తికాయత్ విజయవాడ వేదిక మీది నుంచి పిలుపు నిచ్చారు. వివరాలు


(జువ్వాల బాబ్జీ)

ఎన్నోత్యాగాలు చేసిసాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాలని ప్రముఖ భారతీయ కిసాన్ మోర్చ నాయకుడు,ప్రముఖరైతు ఉద్యమ నేత రాకేష్ తికైత్ పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కును ప్రవేటు పరం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటాని ఆయన సంపూర్ణ మద్దతెలిపారు.

నిన్నరాత్రి ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన సెక్యులర్ పార్టీల ఉమ్మడి సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

" మోడీ - షా హఠావో దేశ్ బచావో" అనే నినాదం తో విజయవాడ లోని సిద్దార్థ కాలేజీ ఆడిటోరియం లో "భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక "ఆధ్వర్యంలో ఈ సభ జరిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలు మూలల నుండి వివిధ సంఘాలు, సంస్ధలు, పార్టీలు, మేధావులు, సామాజిక ఉద్యమ నాయకులు హాజరయ్యారు.

త్వరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో, బిజేపీని, ఆ పార్టీకి కేంద్రం లో సంపూర్ణ మద్దతుగా నిలిచిన వైయస్ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం, జనసేన పార్టీలను ఓడించాలని సభ పిలుపు నిచ్చింది..

ప్రధానంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, పౌరులకు ప్రాథమిక హక్కులు, ఫెడరల్ వ్యవస్థ, లౌకిక రాజ్య పరిరక్షణ, నవ్యాంధ్ర ప్రదేశ్ పునః వ్యవస్థీకరణ చట్టం లోని ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీ, మేజర్ పోర్టు నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు,పునరావాసానికి నిధులు వెనుక బడిన ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధి కి ప్రత్యేక నిధులు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, కడప ఉక్కు పరిశ్రమ సాధన మొదలగు విషయాల పై పోరాటాలు చేయటానికి సిద్ధం కావాలని ఈ సభ పిలుపునిచ్చింది.

సభకు మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రాకేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని, ఢిల్లీ లో జరిగిన ఆందోళన వలే మరో పోరాటం జరగాలని పిలుపునిచ్చారు.

“మీ అందరికీ తెలుసు విశాఖ ఉక్కు పరిశ్రమ ను సాధించుకోవడం లో ఎంతో మంది బలిదానం అయ్యారు. వారి త్యాగాలను మరిచి ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. మేము దానిని వ్యతిరేకిస్తున్నాము. స్టీల్ ప్లాంట్ రక్షణకు కార్మికులు చేసే పోరాటానికి అండగా అందరూ నిలవాలి,” అని కోరారు.

దేశం లో పరిస్థితులు సామాన్య ప్రజలకు అనుకూలంగా లేవు. అభివృద్ధి పేరుతో ఆదివాసీల సాగులో ఉన్న భూములను లాక్కుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ చట్టాలను అసమగ్రంగా తయారు చేస్తుంద నీ,భూసేఖరణ విధానం సరిగా లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విపక్షాల పై ఉక్కు పాదం మోపుతూ, అన్ని రాజ్యంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ. ప్రశ్నించే వారిపై ఈ. డి, సి. బి. ఐ లాంటి సంస్థల నుపయోగించి అణచి వేతకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య పునాదుల ను బలహీన పరుస్తుందని వాపోయారు. డా. బి. ఆర్. అంబేడ్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు.

సభ ఒక రాజకీయ తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి. వి. రాఘవులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, మన రాజ్యాంగంలో ఐదు అంశాలు మూల స్తంభాలుగా ఉన్నాయని, అవి ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సమైఖ్య వాదం, స్వామ్య వాదం మొదలగునవి.

ఇప్పుడు దేశం లో పత్రికా స్వే శ్చ లేదు. మనం వాటిని రక్షించు కో పొతే భవిష్యత్ లేదు.

మనం 1857 సం. లో స్వతంత్ర సంగ్రామం మొదలు పెట్టీ 1947 వరకు విశేషమైన పోరాటాలు చేసి రాజ్యాంగం సాధించుకున్నాం.

2014 సం. లో మోడీ అధికారం లోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. బి. జే.పీ కి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్. డి. టి. వి. కొంత ప్రజానుకూల వార్తలు రాస్తూ క్రియాశీలక పాత్ర పోషించేది దాని యాజమాన్యంపై మనీ లాండరింగ్ కేసులు పెట్టారు, వేధింపుల కు గురిచేసి అదానికీ అమ్ముకునేలా చేశారు.

ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటానికి అండగా వార్తలు రాస్తే న్యూస్ క్లిక్ పై మనీ లాండరింగ్ కేసులు పెట్టీ జర్నలిస్టు లను జైలుకు పంపారు. ఇప్పుడు కొత్తగా ప్రెస్ యాక్ట్ తెచ్చారు. దీని ద్వారా పత్రిక స్వేచ్ఛ ను హరించి వేయాలని చూస్తున్నారు. ఇటీవల నయన తార అనే సినీ నటి ఒక సిన్మా పాత్రలో నటించి అందులో రాముడు కూడా మాంస హారి అన్నందుకు ఆ సిన్మాను నిలిపివేశారు.

మనదేశం లో 109 సం. గా జరుగుతున్న సైన్సు కాంగ్రెస్ కు నిధులు నిలిపి వేశారు అని వివరించారు.

కేంద్ర మాజీ మంత్రి, జే. డి. శీలం మాట్లాడుతూ, ఇప్పటి కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టం లో లోపాలు ఉన్నాయని వారు చేసిన వాగ్దానాల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు.అధికారం లో ఉన్న వారు వాటిని సవరించ వచ్చుగదా? ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ విషయం గురించి, ఇక్కడ ఉన్న ముసుగు పార్టీల నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి చేయటం లేదు?

విభజన చట్టం లో చాలా స్పష్టంగా ఇలా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి చేయటం కోసం కేంద్రమే నిధులు మంజూరు చేయాలని , నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కలిపి ఖర్చు భరించాలని ఉంది. ఈ విషయం గురించి తెలిసిన, వై యస్ ఆర్ పార్టీ, తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదు అని ప్రశ్నించారు. 10 సం. లు ప్రత్యేక హోదా ఏమైందని బి. జే. పి ని నిలదీయాలి.

మణిపూర్ మారణ కాండ పై మూడు పార్టీలు నోరు తెరచి ఖండించలేదు అని శీలం అన్నారు.

సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, భారత దేశం లో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ లు, మహిళ లకు రక్షణ లేదనీ, మణిపూర్ సంఘటన జరిగిన 70 రోజుల తర్వాత విపక్షాలు పార్లమెంటు లో సమాధానం చెప్పమంటే ఎదురు దాడికి దిగారని అన్నారు.

"పద్మావతి "సినిమా వచ్చినప్పుడు బి. జే. పీ కి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు, సినిమా పరిశ్రమ లో ఉన్న మహిళ లందరూ చెడిపోయిన వారేననీ మీడియా సాక్షిగా అన్నారు. ఆ మాటల ను ఇక్కడ ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ ఖండించలేదు. అటువంటి బి. జే. పి. నీ ఇక్కడ తెలుగు ప్రజలు ఎలాగూ రానియ్యరు. కానీ ,దాని ముసుగు పార్టీలుగా ఉన్న వై యస్ ఆర్ కాంగ్రేస్, తెలుగు దేశం, జన సేన పార్టీ లను ఎలా ఓడించగలమో ఆలోచించండి. రాజ్యాంగ హక్కుల గురించే కాకుండా రాష్ట్రాల హక్కుల గురించి కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చలసాని శ్రీనివాస్ , జగన్ మోహన్ రెడ్డికి 25 సీట్లు కావాలని అడిగితే ప్రజలు ఏ.పి.నుండీ 31 మంది ఎంపీ లను ఇచ్చారు , ఆయన తెలుగు జాతి ఆత్మ గౌరవం ను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్సించారు.

మాజీ ఐ పి ఎస్ అధికారి జే.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ,భవిష్యత్తు లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బావ సారూప్యత కలిగిన శక్తులను కలుపుకొని ముందుకు సాగడం మంచిదని అభిప్రాయ పడ్డారు.

ఇంకా ఝాన్సీ, అక్కినేని వనజ, వి. శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

Read More
Next Story