ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. రేషన్  మాఫియాకు మంత్రి మాస్ వార్నింగ్
x

ఏ ఒక్కరిని వదిలిపెట్టం.. రేషన్ మాఫియాకు మంత్రి మాస్ వార్నింగ్

రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఒక్క బియ్యపు గింజ కూడా అక్రమంగా రవాణా కాకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.


రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఒక్క బియ్యపు గింజ కూడా అక్రమంగా రవాణా కాకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కాకినాడ పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలకు ఫుల్‌స్టాప్ పడాలని.. అది సాధించి తీరుతామని స్పష్టం చేశారు. దీనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరినీ ఉపేక్షించదని తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో పోర్ట్ కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే కాకినాడ పోర్ట్ గుండా సాగుతున్న రేషన్ మాఫియాపై మండిపడ్డారు. దానిని ఆపి తీరాలని అన్నారు.

సమావేశం అనంతరం కాకినాడ పోర్ట్ బొంబాయి గేటు దగ్గర చెక్‌పోస్ట్ పనితీరును ఆయన పరిశీలించారు. లోడ్‌తో వస్తున్న వాహనాలను అనుమతించే విధానం, బవురు కొలిచే ప్రక్రియతో పాటు బియ్యం శాంపుల్స్ సేకరణ అంశాలను పరిశీలించారు. వాటికి సంబంధించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. లారీల రవాణా ఆలస్యంపై దృష్టి సారించి అందుకు తగు చర్యలు చేపడతామని, అదనపు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

చెక్ పోస్ట్‌తో ఎగుమతి జాప్యం

ఈ సమావేశంలో భాగంగా కాకినాడ పోర్ట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ కారణంగా ఎగుమతి ఆలస్యమవుతోందని పోర్ట్ ప్రతినిధులు మంత్రి నాదెండ్లకు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మనోహర్.. ఐదేళ్ల నుంచి రేషన్ అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతోందని, దానిని అరికట్టడంలో భాగంగానే పోర్ట్‌లో చెక్‌పోస్ట్ పెట్టామని వివరించారు. ఈ చెక్‌పోస్ట్‌ల సంఖ్యను త్వరతగతిన పెంచుతామని హామీ ఇచ్చారు. తద్వారా పోర్ట్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయని, ఈక్రమంలో పోర్ట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా, పోర్ట్ కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

‘‘ఆహార భద్రత చట్టం కింద పేద వాడు రెండు పూటలా భోజనం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా భియ్యం పంపిణీ చేస్తున్నాం. ఆ బియ్యాన్ని రూ.10 లోపు ధరకు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిల్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ ఇందుకు కేంద్రంగా మారింది. ఈ పోర్ట్ ఒక కుటుంబం కోసం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ పోర్ట్ నిర్మించబడింది. పోర్ట్ కారణంగా ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. వాటి ద్వారా కాకినాడ అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వ హయాంలో ఈ పోర్టును దుర్వినియోగం చేశారు. అధికారులు, మీడియాకు కూడా ప్రవేశం లేకుండా హుకుం జారీ చేసి అక్రమాలకు అడ్డాగా పోర్టును మార్చేశారు’’ అని మండిపడ్డారు.

పూర్తికావొచ్చిన విచారణ

‘‘జూన్ 28, 29 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే అందులో 26 వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ పూర్తికావచ్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు కారకులైన వారికి 41ఏ నోటీసులు జారీ చేస్తాం. విచారణ పూర్తయ్యాక అరెస్టులు ఉంటాయి. ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు.

తనిఖీల విషయంలో వెనక్కి తగ్గం

‘‘బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్ పోస్టు ఏర్పాటు చేశాము. చెక్ పోస్టు ఏర్పాటు వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని పోర్టు మీద ఆధారపడి జీవించే స్టేక్ హోల్డర్స్ మా దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా ఒక పని ప్రారంభించినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. వారం రోజుల్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకుంటాం. రోజుకి వెయ్యి నుంచి 11 వందల లారీల ద్వారా బియ్యం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాం. వచ్చే సోమవారం నుంచి అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాం. ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసి సమయం వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం. చెక్ పోస్టుల్లో సిబ్బంది సంఖ్యను కూడా వెంటనే పెంచుతాం. 12 నుంచి 14 మంది సిబ్బందిని అదనంగా నియమించి మూడు షిఫ్టుల ద్వారా 24 గంటలు చెక్ పోస్టు నడిచే ఏర్పాటు చేస్తాము. తనిఖీల విషయంలో మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు’’ అని తేల్చి చెప్పారు.

వారికి మాత్రం ఇబ్బందులు ఉండదు

‘‘ప్రభుత్వ నిబంధనల మేరకు బియ్యం రవాణా చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యం నేరుగా పోర్టుకి తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాదు. కాకినాడ పోర్టులో ఇలాంటి అక్రమాలు ఆగాలన్నదే మా ఉద్దేశం. ఎక్కడా హమాలీలకు నష్టం కలగకుండా చూస్తాం.. ప్రక్షాళణలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొంత జాప్యం జరగవచ్చు ఆలోచనా విధానంలో మంచి పరిపాలన అందిరికి అందేలా చూడాలన్న ఉద్దేశంతో మేందుకు వెళ్తున్నాం. ప్రభుత్వపరంగా న్యాయబద్దంగా చేయాల్సినవి చేస్తాం. ఎవరి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం’’ అని అన్నారు.

Read More
Next Story