‘జగన్ మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి’.. షర్మిల ధ్వజం
x

‘జగన్ మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి’.. షర్మిల ధ్వజం

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం చిలిచిలికి గాలి వానలా మారుతోంది. మాటకు మాటగా ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.


వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మాటకు మాటగా ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును జగన్ ప్రశ్నించడానికే ప్రజలు 11 స్థానాలు ఇచ్చారని, ఆ పని మానుకుని జగన్.. అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగును పులిమి స్వలాభం పొందాలని చూస్తునస్నారని విమర్శలు గుప్పించారు. దానిపై వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది. తనపై చంద్రబాబు ఏజెంట్‌లు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎక్స్(ట్విట్టర్) వేదిగా ఘాటైన రిప్లై ఇచ్చారు. మీ మాటల ద్వారా మీ అజెండా ఏంటో తేటతెల్లం అవుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

వారికీ మాకూ మధ్య తేడా ఉంది: వైసీపీ

సిగ్గు.. సిగ్గు.. అంటూ జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ బదులిస్తూ.. ‘‘సీఎం చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి పనిచేసేవారికీ మధ్య తేడా ఉంటుంది షర్మిల. మీ మాటలు చూస్తే జగన్‌ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉండి, మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే… మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్‌ను తిట్టడమే అని అర్థమవుతోంది.

దివంగత మహానేత, మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా? రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళనచేసిన వారితో మీరు కలిసి నడవడంలేదా? తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా?

మీకన్నా.. పిరికివాళ్లు

మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు

మీకన్నా.. అహంకారులు

మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా?

ఇంతకీ మీరు పోస్టుచేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా?’’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన షర్మిల వ్యంగ్యంగా బదులిచ్చారు. మీలాంటి వాళ్లను మ్యూజియంలో పెట్టాలని సెలవిచ్చారు.

తప్పు కాబట్టే తప్పు అన్నాం: షర్మిల

తండ్రి మరణాన్ని అవహేళన చేసిన వారితో అంటుడుకుతున్న నేత షర్మిల అంటూ వైసీపీ చేసిన ట్వీట్‌కు షర్మిల కూడా అదే రేంజ్‌లో బదులిచ్చారు. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని, అద్దంలో చూసుకుంటే మీ మొఖాలకు బదులు చంద్రబాబే కనిపిస్తున్నారంటూ చురకలంటించారు. ‘‘జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నారు. సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది’’ అని బదులిచ్చారు.

అధికార పక్షమా.. ప్రతిపక్షమా అనేది ముఖ్యం కాదు

‘‘ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం! వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్‌కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు’’ అని అన్నారు.

వైసీపీలో పెద్దోళ్లంతా వారే కదా

అనంతరం వైసీపీలోని పెద్దలనుద్దేశించి కూడా షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేశారని ఏవేవో మాటలు చెప్తున్నారని, అసలు ముందు వైసీపీలోని పెద్దోళ్ల సంగతి చూడాలని వ్యాఖ్యానించారు. ‘‘అసలు వైసీపీలో వైఎస్సార్‌ని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు.

YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం

Y అంటే వైవీ సుబ్బారెడ్డి,

S అంటే సాయిరెడ్డి,

R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే. కాబట్టి వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫి చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా ? రూ.3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూ.4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు! మీ అహంకారమే మీ పతనానికి కారణం!’’ అంటూ మండిపడ్డారు.

Read More
Next Story