వైఎస్‌ షర్మిలను కట్టడి చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్‌గా మారింది.


G Vijaya Kumar

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన దగా డిఎస్సీ ధర్నా, చలో సచివాలయం కార్యక్రమం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం దీనిపైనే చర్చించుకుంటున్నాయి. దగా డిఎస్సీ పేరుతో సచివాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు. దీనికి పార్టీలకు అతీతంగా మద్ధతు లభించింది. సీపీఐ రామకృష్ణ ధర్నాలో పాల్గొని కాంగ్రెస్‌కు సంఘీభావం తెలిపారు. వేలాది మంది కాగ్రెస్‌ కార్యకర్తలతో పాటు భారీగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే వీరు రోడ్లపైకి వస్తే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపిసిపి అధ్యక్షురాలు షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయమైన విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లోనే నిర్బంధించారు. కొందరు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలను బుధవారం అర్ధ రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. అయితే గురువారం వాటిని చేధించుకొని వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపైకి తరలి రావడంతో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దీంతో విజయవాడలోని కొన్ని రోడ్లు రణరంగంగా మారాయి.

ప్రభుత్వ వైఫల్యాల తూర్పార
ఆం«ధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన సోదరుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలను సంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేయడం ఆరంభించింది. బిజెపితో వైసిపి, టిడిపిలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. కేంద్రం నుంచి నిధులు తేవడంలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రొజెక్టు నిధులు సాధించడంలో ఫెయిలయ్యారని విమర్శించారు. పదేళ్లల్లో చంద్రబాబు, జగన్‌ రాష్ట్రానికి ఏమీ చేయలేక పోయారని, బిజెపికి తొత్తులుగా మారారని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనలో ధ్వజమెత్తారు.
పార్టీ బలోపేతంపై దృష్టి
రానున్న సార్వత్రిక ఎన్నికల సమయం తక్కువ ఉండటంతో అందుకు కాంగ్రెస్‌ పార్టీని సన్నద్ధం చేసే పనిపై దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితులను కలుసుకోవడం కూడా ఆ పార్టీ వర్గాల్లో జీవం పోసినటై్టంది. అంతేకాకుండా బుల్లెట్‌ వేగంతో రాష్ట్ర పర్యటన కూడా ఒక దఫా చేపట్టారు. షర్మిల చేసిన పర్యటనలు, నిర్వహించిన సమావేశాలు, జగన్‌ ప్రభుత్వంపై ఎక్కు పెట్టిన విమర్శలు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ను పెంచాయని చెప్పొచ్చు. షర్మిల విమర్శలు జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఆమెను ఎదుర్కోవడంలో జగన్‌ ప్రభుత్వం తడబడిందని, ఇదే దూకుడు కొనసాగిస్తే జగన్‌ ప్రభుత్వానికి గండి పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story