క‌ల్ప‌వృక్ష వాహనంపై శ్రీ మలయప్ప క‌టాక్షం
x

క‌ల్ప‌వృక్ష వాహనంపై శ్రీ మలయప్ప క‌టాక్షం

స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Read More
Next Story