సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఆంధ్రప్రదేశ్‌ రైతులను సర్వనాశనం చేశారని షర్మిల అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఇద్దరు కలిసి రాష్ట్రంలోని రైతులను నిండా ముంచారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..

లక్షల్లో అప్పులు.. రోజుకో రైతు బలవన్మరణం. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను పట్టించుకొనే దిక్కు లేదు. కాంగ్రెస్‌ పాలనలో మహానేత వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన రైతులు.. నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారు. మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారు. కూరగాయల ధరలకు మార్కెట్‌లో రెక్కలొస్తున్నా.. రైతుకు పెట్టుబడి మాత్రం అందక పండిన పంటకు నిప్పు పెట్టుకొనే దీనస్థితి ఏపీలో నెలకొంది.
ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయి. చంద్రబాబు మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని చెప్పి తర్వాత మాట తప్పితే.. జగన్‌ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారు. ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారు. ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారు తప్పిస్తే రూపాయి ఇచ్చింది లేదు. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యానికి బస్తాకు రూ.1400 మించి ధర అందలేదు. పత్తి ధర రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయింది. మిర్చి అయితే రూ.23 వేలు అందాల్సిన చోట రూ.11 వేల కంటే ఎక్కువ ధర దక్కలేదు. కంది రూ.10 వేల నుంచి రూ.7 వేలకు మార్కెట్‌ ధర తగ్గింది.
రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధిని తక్షణం ఏర్పాటు చేయండి. ఏడాదికి రూ.5 వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయించండి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అన్నధాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ.20 వేల సహాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.
Next Story