‘వాల్మీకి స్కామ్‌తో టీజీ కాంగ్రెస్‌కు లింకు’.. అసలేంటీ స్కామ్
x

‘వాల్మీకి స్కామ్‌తో టీజీ కాంగ్రెస్‌కు లింకు’.. అసలేంటీ స్కామ్

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌కు తెలంగాణ కాంగ్రెస్ లింకులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌కు తెలంగాణ కాంగ్రెస్ లింకులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న క్రమంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణం సొమ్ములో రూ.45 కోట్లు తెలంగాణకు బదిలీ అయ్యాయని కూడా కేటీఆర్ ఆరోపించారు. వీటన్నింటి వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. స్కామ్ జరిగిందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య.. ఆ రాష్ట్ర అసెంబ్లీ దశగా అంగీకరించారని గుర్తు చేశారు. అదే విధంగా సిద్ధరామయ్యను తొలిగిస్తే తెలంగాణలో ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యల పరమార్థం ఏంటి? అని కూడా కేటీఆర్ నిలదీశారు.

‘‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ మొత్తంలో రూ.45 కోట్లు తెలంగాణకు చెందిన తొమ్మిది బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఎంపీ ఎన్నికల సమయంలో ఆ మొత్తాన్ని కొన్ని బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులు విత్‌డ్రా కూడా చేశారు. ఎన్నికల వేళ ఇంత మొత్తంలో ఎందుకు బదిలీ చేశారు? వాటిని విత్ డ్రా చేసిన నిర్వాహకులు ఆ మొత్తాన్ని ఎందుకు వాడారు? ఈ స్కామ్‌కు సంబంధించి తెలంగాణలో సిట్, సీఐడీ, ఈడీ సోదాలు కూడా చేశాయి. కానీ వాటికి సంబంధించి రవ్వంత సమాచారం కూడా బయటకు రాలేదు. ఆ విధంగా సంస్థలను అణచివేశారు. ఎస్టీ కార్పొరేషన్‌లో రూ.90 కోట్ల కుంభకోణం జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ సాక్షిగా అంగీకిరంచారు. అదే విధంగా సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలుతుందని ఆ రాష్ట్ర మంత్రి సతీష్ చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటి? ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినా ఈడీ ఇప్పటి వరకు ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? తెలంగాణ కాంగ్రెస్‌ను రక్షిస్తున్నది ఎవరు?’’ అని కేటీఆర్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం దుమారం రేపుతోంది.

అసలేంటీ వాల్మీకి స్కాం?

కర్ణాటక మహిర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో భారీగానే నగదు ఉంది. కానీ అందులో రూ.187 కోట్లు తారుమారయ్యాయి. ఈ కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండ్‌ పీ చంద్రశేఖరన్.. మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన సూసైడ్ నోట్‌లో ఈ స్కామ్ గురించి తెలిపారు. దీంతో వాల్మీకి స్కామ్ వెలుగు చూసింది. దీనిపై విచారణ జరపాలంటూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో వారు సిట్‌ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంచడానికే ఈ వాల్మీకి స్కామ్ చేసినట్లు ఈడీ, సిట్ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి నాగేంద్ర, కార్పొరేషన్ ఛైర్మన్ బసనగౌడ దద్దల్, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా 11 మందిని పాత్ర ఉంది. వారందరినీ ఈడీ అరెస్ట్ కూడా చేసింది.

హైదరాబాద్‌కు వాల్మీకి స్కాం డబ్బు

కర్ణాటకలో జరిగిన రూ.187 కోట్ల వాల్మీకి స్కాం నగదులో తెలుగు రాష్ట్రాలకు రూ.90 కోట్లు చేరాయని సిట్ తన అంతర్గత నివేదికలో పేర్కొంది. 30 మార్చి 2024న వాల్మీకి కార్పొరేషన్ అప్పటి ఎండీ పద్మనాభ్, అకౌంట్స్ అధికారి పరశురామ్ కలిసి బెంగళూరులోని యూబీఐ బ్యాంకు ఎంజీ రోడ్డు బ్రాంచీలో రూ.50 కోట్లు జమ చేశారు. అనంతరం వాటిపై రూ.45 కోట్ల రుణం తీసుకుని ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ఆర్‌బీఎల్ బ్యాంకుకు చెందిన 9 ఖాతాలకు బదిలీ చేసినట్లు సిట్ నివేదిక పేర్కొంది.

Read More
Next Story