లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారంతా ఎవరి తాలూకా అనే విషయాన్ని సీఎం చంద్రబాబు నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్నారు.


రాష్ట్రంలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. మద్యం షాపులు ప్రైవేట్‌ వారికి కేటాయించే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపింది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానం అమలుపై అధ్యయనం చేసి ప్రభుత్వం కంటే ప్రైవేట్‌ వారి చేతుల్లోనే షాపులు ఉండటం మంచిదని భావించి షాపుల నిర్వహణకు మద్యం వ్యాపారులు, ఇతరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకునే వారు నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్‌ కింద దరఖాస్తుకు రెండు లక్షలు చెల్లించారు. ఇలా చెల్లించిన మొత్తం సుమారు 18వేల కోట్లకు పైనే ఉంది.

ఎవరు ఎక్కువ శాతం షాపులు దక్కించుకున్నారు..
మద్యం షాపులు లాటరీలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అనుచరులకే దక్కాయి. ఎక్కువగా ఏ వర్గం వారు, ఎవరి మనుషులకు షాపులు దక్కాయనే వివరాలు సేకరించి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఇంటిలిజెన్స్‌ వారిని కోరటంతో సోమవారం సాయంత్రానికి సీఎంకు ఎవరి అనుచరులు ఎంత మంది అనే వివరాలు సేకరించారు. ఇంటిలిజెన్స్‌ వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మూడొంతులు పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల అనుచరులకే షాపులు దక్కాయి. తాను ఈ వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినా ఎమ్మెల్యేలు వారి అనుచరుల ద్వారా దరఖాస్తులు వేయించి షాపులు దక్కేలా చూసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారి అనుచరులకే ఎక్కువ షాపులు దక్కినట్లు సమాచారం. ఇక జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కనుసన్నల్లోనూ చాలా మంది దరఖాస్తులు వేసుకున్నారు. వారిలో కూడా ఎక్కువ మందికి షాపులు దక్కాయి.
ఎమ్మెల్యేలు ఎలా ప్లాన్‌ చేశారు..
ఎన్‌డీఏ కూటమిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసి కట్టుగా షాపులు దక్కించుకునేందుకు పన్నిన వ్యూహాలు ఫలించాయి. షాపులు దక్కించుకునేందుకు ముందుగా ఇతర పార్టీలు, మద్యం వ్యాపార రంగంలో ఉన్న వారిని దరఖాస్తులు వేయకుండా ప్రజా ప్రతినిధుల ద్వారా అడ్డుకో గలిగారు. దీంతో ఎన్‌డీఏ కూటమిలోని వారు కాకుండా వేరే వారు దరఖాస్తులు ఎక్కువగా వేసేందుకు ముందుకు రాలేదు. విజయవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయులు ఎక్కువ మంది దరఖాస్తులు వేశారు. షాపులు కూడా వారికే ఎక్కువగా వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్‌ డబ్బులు వారే కట్టి తన అనుచరులకు షాపులు దక్కేలా చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో షాపుకు పది మంది చేత కొందరు ఎమ్మెల్యేలు అప్లికేషన్‌లు పెట్టించినట్లు సమాచారం. దీనిపైనే చంద్రబాబునాయుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించారు.
వైఎస్సార్‌సీపీ వారు ఎందుకు దూరంగా ఉన్నారు...
వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఎక్కవ మంది మద్యం వ్యాపారానికి దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారని కొందరిని ప్రశ్నస్తే తాము వైఎస్సార్‌సీపీ వారమని తెలిసిన తరువాత ఏదో ఒక తప్పును వెతికి పట్టకుని కేసులు నమోదు చేస్తారు. దీని వల్ల అధికార పార్టీకి లాభం జరిగినా మాకు తప్పకుండా నష్టం జరుగుతుంది. అందుకే చాలా మంది ఇతర పార్టీల వారు మద్యం షాపులకు దరఖాస్తులు చేయలేదన్నారు. షాపులు దక్కించుకున్నా మద్యం సరఫరాలో కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు. కావాల్సినంత స్టాకు ఇవ్వకపోవడం, కావాల్సిన బ్రాండ్స్‌ ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నేపథ్యం ఇలా ఉన్నప్పుడు దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచనలో మద్యం వ్యాపారం జోలికి వారు రాలేదు.
టీడీపీ వారికే షాపులు వచ్చాయని ఎలా చెప్పొచ్చు...
ఉదాహరణకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మూడు మండలాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎర్రగొండపాలెం మండలంలో ఐదు షాపులు ఉన్నాయి. ఐదుగ్గురూ టీడీపీ వారే. త్రిపురాంతకం మండలంలోని ఐదు షాపులు దక్కించుకున్న వారు టీడీపీ వారే, పుల్లలచెరువు మండలానికి మూడు షాపులు కేటాయించారు. వారు కూడా తెలుగుదేశం పార్టీకి చెంది వారే కావడం విశేషం. అంటే మొత్తం ఐదు మండలాల్లోని అన్ని షాపులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకే దక్కాయి. అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. విజయవాడ పట్టణంలోనూ ఇదే పరిస్థితి ఉంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్‌ ఎమ్మెల్యేలు ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి
చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమని స్పందించారంటే...
1. లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబు గారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా? మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా?
2. చంద్రబాబు గారూ… మీరు తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? “నీకింత… నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్‌ కాదా? లైసెన్స్‌ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్ల కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడం కోసం లిక్కర్‌ కొనుక్కున్న వారి జేబులు గుల్ల చేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువులకోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబుగారూ?
3. కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్‌ లిక్కర్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవే. వైయస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టరీలకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంకోవైపు ఎమ్మార్పీ మీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత… నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబుగారూ?
4. ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. చంద్రబాబుగారూ… ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?
5. 2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్‌ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టుషాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయి. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్‌ రూమ్స్‌, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్‌ ఏరులై పారింది.. వైయస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించింది. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్‌ పెట్టింది. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించింది. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసింది. లాభాపేక్షలేనందున పర్మిట్‌రూమ్స్‌, బెల్టుషాపులు.. ఇవన్నీ రద్దు అయ్యాయి. ఈ పద్ధతిని ఇప్పుడు ఎత్తివేసి, దుకాణాల సంఖ్యను మళ్లీ పెంచి మొత్తం అన్నింటినీ మీ మనుషులకు అప్పగించారు. ఇక వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్‌రూమ్స్‌, బెల్టుషాపులకు లెక్కే లేదు. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వపు దారుణ పరిస్థితులకు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబుగారూ?
6. లక్షల సంఖ్యలో ఉద్యోగాలంటూ అబద్ధాల మీద, అబద్ధాలు చెప్పి రోజూ మీ మీడియాలో ఊదరగొట్టే మీరు, మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో పనిచేస్తున్న 15వేల మంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డున పడ్డారు. మరి, వీరి బాగోగుల సంగతేంటి చంద్రబాబు గారూ?
7. చంద్రబాబు గారూ… మీ అక్రమార్జనకోసం, మీకు, మీవాళ్లకు అవినీతి డబ్బు సంపాదించడంకోసం మీరు అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీ రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. అక్కచెల్లెమ్మల ఉసురు, యువత ఉసురు, ఆరోగ్యం రూపేణా ప్రజల ఉసురు మీరు పోసుకున్నట్టే. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఇప్పటికే తిరోగమనం పట్టించారు. అవినీతి ధ్యేయంగా తెచ్చిన లిక్కర్‌ పాలసీతో రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. మీ చర్యలను వెంటనే సరిదిద్దుకోండి. లేకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం.
Next Story