టార్గెట్‌ వైఎస్‌ జగన్‌

కృష్ణా జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ సభలో యువతరం కేరింతలు కొట్టారు


టార్గెట్‌ వైఎస్‌ జగన్‌
x
Chandrababu Naidu, TDP President

కృష్ణా జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ సభలో యువతరం కేరింతలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపాలో వివరిస్తూ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్లోగన్లు పలువురిని ఆకట్టుకున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేస్తూ టీడీపీ ‘రా కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. ఒకతరం కోలుకోలేని విధంగా దుర్మార్గపు పాలనలో నష్టపోతోందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆలోచింప జేశాయి. నాతో సహా అందరూ జగన్‌బాధితులేనంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచనలం సృష్టించాయి. ఇటువంటి అరాచకపాలన సాగనిస్తే రాష్ట్రం వందల సంవత్సరాలు వెనక్కుపోతుందనే విషయం స్పష్టం చేస్తూ సాగిన ప్రసంగంలో ఉత్కంఠ కొనసాగించారు. ఒకపక్క అమరావతి వెలవెల బోతున్నది... హైదరాబాద్‌ వెలిగిపోతున్నది. ఇందుకు జగన్‌ రివర్స్‌ పాలన కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.



మూడు నెలల్లో రైతు రాజ్యం
మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని చంద్రబాబు చెప్పారు. రైతుల బతుకు బాగుపడాలంటే, దేశ విదేశాల్లో రైతుకు విలువ పెరగాల్సిన అవసరాన్ని చెబుతూ.. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు దేశంలో రెండో స్థానంలో ఉన్నాయని గుర్తు చేశారు. అప్పులు రాష్ట్రాన్ని ముంచేస్తాయనే ఆందోళన ఆయన ప్రసంగంలో వ్యక్తమైంది.
మూడు ముక్కలాటతో రాజధాని ఎక్కడో ఎవరూ ఇప్పటికీ చెప్పలేని పరిస్థితులు ఏర్పడటాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ అధికారం చేపట్టగానే అమరావతి రాజధాని అని గర్వపడేలా చెప్పుకునే రోజు వస్తుందని చెప్పడంతో సభ నుంచి హర్షద్వానాలు హోరెత్తాయి.
మూడు నెలల్లో సూపర్‌ సిక్స్‌..
‘బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ’తో సూపర్‌ సిక్స్‌ అందిస్తామని చంద్రబాబు చెబుతూ నిరుద్యోగులకు రూ. 3వేలు భృతి, అన్నదాత కింద ఏడాదికి రైతుకు రూ. 20వేలు, జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రత్యేకించి న్యాయం చేకూరేలా మ్యానిఫెస్టో రాబోతోందంటూ చెప్పడంతో సభికుల్లో సంతోషం వెల్లివిరిసింది.
జగన్‌ సొంతపార్టీ ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారిని క్యాండిడేట్స్‌గా పెడుతున్నారు. గుంటూరు ఎంపీ టిక్కెట్‌ పేరుతో క్రికెటర్‌ అంబటి రాయుడును వైఎస్సార్‌సీపీలోకి తీసుకున్నారు, ఈ సీటు మరొకరికి కేటాయించడంతో బయటకు పోవాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు పలువురిలో కలకలం రేకెత్తించాయి. టీడీపీలోని నన్ను, లోకేష్‌ను, పవన్‌ను తిట్టిన వాళ్లకు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇదెక్కడి చోద్యం అనడం కూడా సభకు వచ్చిన వారిలో నవ్వులు తెప్పించాయి.
టీడీపీ సభలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన జెండాలు కనిపించాయి. పలు సార్లు చంద్రబాబు నోటి నుంచి జనసేన పార్టీ పేరు వచ్చింది. ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం. మంచి పాలన అందిస్తామని చెప్పుకున్నారు.
Next Story