రాజకీయమంటే ప్రజాసేవనే అర్థం ఉందంటారు పండితులు. ఇదేంటో మన రాజకీయనాయకులు జనాన్ని నమ్మడానికి బదులు కోట్లకు అమ్ముడయ్యే వ్యూహకర్తల్ని నమ్ముకుంటున్నారు.


ఎన్నికలు సమీపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్‌ పెరిగింది. కోట్లకు కోట్లు వీరిపై పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు ఒకే వ్యూహకర్తతో ముందుకు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక పార్టీకి వ్యూహం చెప్పిన వ్యక్తి మరో పార్టీకి వ్యూహం చెప్పేందుకు వచ్చారు. ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా పోటీ పడుతున్నాయి. ఇరువురు పోటీ దారులకు ఒక్కరే వ్యూహకర్త అంటే విచిత్రంగా లేదూ.. గత ఎన్నికల్లో నేను చెప్పిన వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లబట్టే వైఎస్‌ జగన్‌ గెలిచారనే ధీమాలో ప్రశాంత్‌ కిశోర్‌ ఉన్నారు. ఇప్పుడు నా వ్యూహం టీడీపిని గెలిపిస్తుందనే ధీమాతోనూ ఉన్నారు. పైగా ప్రశాంత్‌ కిశోర్‌ టీములో ఉన్న ఇరువురు వ్యూహకర్తల్లో ఒకరైన రాబిన్‌ శర్మ తెలుగుదేశం పార్టీకి కావాల్సిన వ్యూహాలు రూపొందించి ఇస్తున్నారు. ఇక రెండో వ్యూహకర్త రిషి వైఎస్సార్‌సీపీకి కావాల్సిన వ్యూహాలు రూపొందించి ఇస్తున్నారు. ఇద్దరినీ ఒకరికి తెలియకుండా ఒకరిని మ్యానేజ్‌ చేసే వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ శనివారం ఆకస్మాత్‌గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్‌ నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌లో ఉదయం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రశాంత్‌ కిశోర్‌ కిశోర్‌తో పాటు టీము సభ్యులు కూడా కొందరు వచ్చారు. చాలాసేపు చంద్రబాబుతో ప్రశాంత్‌ కిశోర్‌ చర్చించారు. అంటే ఒక విధంగా జగన్, చంద్రబాబులతో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలాట ఆడుతున్నారన్నమాట.



నేతలకు సొంత వ్యూహాలు లేవా?
రాజకీయ నాయకులు అన్న తరువాత వ్యూహాలు రచించడం, అమలు చేయడం సహజం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు వద్ద కానీ, జగన్‌ వద్ద కానీ వ్యూహాలు లేవు. వ్యూహకర్తలను పిలిపించుకుని వారి ఆలోచనలతో ప్రజల నాడి గమనించి ఎన్నికల్లో నెగ్గుతున్నారు. వారు ఇస్తున్న సూచనలు, సలహాలు, వ్యూహాలు అన్నీ ఆయా పార్టీలు ఎన్నికల మ్యానిపెస్టోలో పెడుతున్నాయి. ఈ మ్యానిఫెస్టోలు చూస్తే పార్టీల నేతలకే తలలు తిరుగుతున్నాయి. రాష్ట్రాదాయాన్ని పూర్తిగా ప్రజలకు ఉచితంగా పంచిపెట్టే కార్యక్రమమే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు జగన్‌ చేస్తున్నది అదే. ఉచిత పంపిణీలతో పార్టీలు అప్పటికప్పుడు గెలవొచ్చేమో కాని రాష్ట్రాభివృద్ధి మాత్రం అట్టడుగుకు పోతున్నదని ప్రజలు వాపోతున్నారు.


మ్యానిఫెస్టో తయారీకి వ్యూహకర్తలు ఎందుకు?
చంద్రబాబు నాయుడు జనసేనతో కలిసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు ఒక ప్రత్యేక మ్యానిఫెస్టోను తయారు చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌ను పిలిపించినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వద్ద బోలెడన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ పథకాలుగా మార్చారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ ఇంకే వ్యూహం చెబుతారు. నేరుగా ఓట్లు సంపాదించే వ్యూహం చెబుతారా? లేక రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహం చెబుతారా? ఏమిటి ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పే వ్యూహమనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది.
Next Story