బీజేపీతో పొత్తుల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో కూడా నెలకొన్నది.


జి విజయ కుమార్

దేశ వ్యాప్తంగా మైనారీటీ వర్గాలపై బీజేపీ సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఆ వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందని టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో భయం వ్యక్తం అవుతోంది. ముస్లీం నేతకు వైఎస్‌ఆర్‌సీపీ విజయవాడ పశ్చి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్‌ ఇవ్వడం, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో నాన్‌ ముస్లీం నేతకు టికెట్‌ ఖరారు కానుండటంతో విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలోని ముస్లీం మైనారీటీ వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో అనేది ఆసక్తి కరంగా మారింది.

మైనారీటీ వర్గాలే మెజారీ ఓటర్లు
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ముస్లీం మైనారిటీ వర్గానికి చెందిన వారే మెజారిటీ ఓటర్లు. గెలుపు ఓటములపై వీరి ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటుంది. సుమారు 45వేల పైచిలుకు ఓటర్లు విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ఉన్నారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థి గెలుస్తారు. బిసిలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. ప్రధానంగా నగరాలు వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీరు కూడా ప్రధాన సంఖ్యలోనే ఉంటారు. వీరి తర్వాత ఆర్య వైశ్య వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఈ మూడు వర్గాల వారే ఇక్కడ కీలక ఓటర్లు. వీరిని కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం మైనారీటీ «వర్గాల దృక్పథం మారింది. దేశ వ్యాప్తంగా ముస్లీం వర్గాలపై బీజేపీ దాడులు పెచ్చరిల్లాయి. యాంటీ ముస్లీములే లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేస్తోంది. ఈ ప్రభావం ఇక్కడున్న ముస్లీం వర్గాలపై ఉంది. ఇది ఈ సారి ఎన్నికలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గతంలో బీజేపీని స్వాగతించని మైనారీటీ ఓటర్లు
2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి ఓటమి పాలయ్యారు. ముస్లీం ఓటర్లు వ్యతిరేకించడంతో ఓటమి చవి చూశారు. ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ముస్లీం నేత జలీల్‌ ఖాన్‌ గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరీలోకి దిగిన జలీల్‌ ఖాన్‌ భారీ ఓట్ల ఆ«ధిక్యంతో గెలుపొందారు. అయితే వెల్లంపల్లికి కూడా గణనీయంగానే ఓట్లు వచ్చాయి. దాదాపు 50వేల వరకు ఓట్లు లభించాయి. అయితే 2009లో వెల్లంపల్లి పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో ఆయనకు ముస్లీం వర్గాలతో ఉన్న సత్సంబంధాలు వల్ల 2014 బీజేపీ తరఫున పోటీ చేసినా కొంత మంది ముస్లీం వర్గాలు ఆదరించగా మరి కొంత మంది తిరస్కరించారు. దీంతో ఆయన ఓటమి చెందారు.
టీడీపీలోనూ బలమైన ముస్లీం నేతలు
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో టీడీపీ పార్టీకి కూడా ముస్లీం మైనారీటీ వర్గానికి చెందిన బలమైన నేతలు ఉన్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్, నాగూల్‌ మీరా, ఎంఎస్‌ బేగ్‌లు ప్రధాన నేతలు. వీరు ముగ్గురు ముస్లీం వర్గాల్లో మంచి పట్టు ఉన్న సీనియర్‌ నాయకులు. జలీల్‌ ఖాన్‌ అయితే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగూల్‌ మీరా టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. ఇక ఎంఎస్‌ బేగ్‌ది రాజకీయ కుటుంబం. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తండ్రి ఎంకే బేగ్‌ 1989లోనే ఎమ్మెల్యేగా పని చేశారు. విజయవాడ పశ్చిమలో వీరికి విస్తృత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. కేవలం ముస్లీంలతోనే కాకుండా బిసిలు, వైశ్యులు ఇతరులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వీరు ముగ్గురు సహకరిస్తే టీడీపీ, జనసే, బీజేపీ కూటమి అభ్యర్థి వైపు మెజారీటీ సంఖ్యలో ముస్లీం వర్గాలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కూడా ఇక్కడ మంచి పట్టు ఉంది. ముస్లింలతో పాటు బీసీలు, వైశ్య వర్గాలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ నలుగురు కూడా విజయవాడ పశ్చి టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
జనసేనకే విజయవాడ పశ్చిమ స్థానం
విజయవాడ పశ్చి స్థానం కావాలని తొలి నుంచి జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పట్టుబడుతున్నారు. దీంతో పొత్తుల్లో దీనిని జనసేనకే కేటాయించనున్నారు. ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్‌కు టికెట్‌ ఖరారు చేయనున్నారు. 2019లో జనసేన నుంచి మహేష్‌ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయినా ఓట్లు గణనీయంగానే లభించాయి. నాటి నుంచి ఆయన విజయవాడ పశ్చి నియోజక వర్గంలో కలియ తిరుగుతున్నారు. బిసిలు, నగరాలలో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ముస్లిం వర్గాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పొత్తు నేపథ్యంలో ఒక వేళ ముస్లిం వర్గాల్లో కొంత మంది వ్యతిరేకించినా ఆ లోటును బిసిలు, నగరాలకు చెందిన వర్గాలతో భర్తీ చేయొచ్చని అలోచనల్లో ఉన్నారు.
Next Story