జనసేన నేత కోరిన స్థానాలు చంద్రబాబు ఇవ్వలేదా. ఇచ్చినా అభ్యర్థులను పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించలేదా?


జి వియాయ కుమార్

ఇప్పటి వరకు టిడిపి, జనసేన పొత్తులు, ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ ముగియడంతో తాజాగా జనసేనకు ఎక్కడెక్కడ ఏయే స్థానాలు కేటాయిస్తారనే దానిపై మరలింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల కంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తక్కిన చోట కంటే ఈ ప్రాంతాలకు చెందిన అసెంబ్లీ నియోజక వర్గాలను ఎక్కువ కేటాయించాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు ఆరు నుంచి ఏడు స్థానాలు కోరనున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ స్థానాలు ఉండనున్నాయి. కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, రాజమండ్రి రూరల్, పిఠాపురం, భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాలకొండ, పెందుర్తి, యలమంచిలి, విశాఖపట్నం సౌత్, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, దర్శి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, గుంటూరు పశ్చిమ, అనంతపురం తదితర అసెంబ్లీ స్థానాలు కోరాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ స్థానాలకు కోరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పొత్తులో తొలి జాబితాలో ఐదు స్థానాలు, అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్థానాలు, పేర్లు ముందుగా ఊహించిన విధంగానే ప్రకటించారు. తెనాలి నుంచి నాదేండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పేర్లు ప్రకటించారు.
24 స్థానాల వివరాలు కూడా పవన్‌కు బాబు చెప్పారా?
జనసేనకు ఇవ్వాల్సిన 24 స్థానాలు ఇప్పటికే చంద్రబాబు చెప్పారని, ఆ స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని పెట్టాలనే అంశంపై జనసేన నేత కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అంతే కాని సంఖ్య చెప్పి నియోజకవర్గాలు చెప్పకుండా చంద్రబాబు ఆపలేదని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ దారులు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికి సీటు కేటాయిద్దామనే అంశంపై మాత్రమే చర్చ సాగుతున్నట్లు తెలిసింది.
పార్లమెంట్‌ స్థానాలు ఇవే
టిడిపి పొత్తులో భాగంగా జనసేనకు మూడు పార్లమెంట్‌ స్థానాలు కేటాయించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం స్థానాలు కేటాయించనున్నారు. అనకాపల్లి నుంచి పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు, మచిలీపట్నం నుంచి సిట్టింగ్‌ ఎంపి బాలశౌరీ, కాకినాడ పార్లమెంట్‌ నుంచి సానా సతీష్‌లు బరిలో నిలవనున్నట్లు తెలిసింది.
Next Story