మంత్రి నారా లోకేష్ శనివారం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,25,848 మంది ఫస్ట్ ఇయర్, 4,91,254 మంది సెకెండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జనరల్ విద్యార్థులు 9,09,325 మంది ఉండగా, వొకేషనల్ విద్యార్థులు 71,842 మంది ఉన్నారు. ప్రయివేటు విద్యార్థులు 35,935 మంది ఉన్నారు. సెకెండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు 83 శాతం, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకెండ్ ఇయర్ వొకేషన్ విద్యార్థులు 77 శాతం, మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండర్ ఇయర్లో 80 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించగా 86 శాతం మంది బాలికలు పాసయ్యారు. మొదటి ఏడాదిలో 66 శాతం మంది బాలురు పాసైతే, 75 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇక వొకేషనల్లో కూడా అదే కంటిన్యూ అయ్యింది. సెకెండ్ ఇయర్లో 67 శాతం మంది బాలురు పాసైతే, 84 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాదిలో 50 శాతం మంది బాలురు పాసైతే, బాలికలు 71 శాతం మంది పాసయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. అన్నింటి కంటే ఆఖరు స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. కృష్ణా జిల్లాలో సెకెండ్ ఇయర్ విద్యార్థులు 93 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫస్ట్ ఇయర్లో 85 శాతం మంది పాసయ్యారు. తర్వాత 91 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 89 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖ, పార్వతీపురం మన్యం, తిరుపతి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, పల్నాడు, అనంతపురం, అన్నమయ్య, విజయనగరం, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, శ్రీసత్యసాయి, కడప, శ్రీకాకుళం జిల్లాలు స్థానాలు దక్కించుకున్నాయి. చిత్తూరు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చివరి ఆఖరి మూడు స్థానాల్లో నిలిచాయి.
అయితే ఇంటర్ పరీక్షల్లో తప్పిన వాళ్లకు సప్లెమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మే 12 నుంచి మే 20 వరకు రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో మొదటి ఏడాది విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు కూడా వీలు కల్పించింది. మే 28 నుంచి జూన్ 1 వరకు జిల్లా హెడ్ క్వార్ట్స్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వీటికి సంబందించిన పరీక్షల ఫీజును కాలేజీల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 వరకు పరీక్షల ఫీజులను చెల్లించేందుకు అవకాశం కల్పించింది.